గుణ, జనవరి 19: బీజేపీలో చేరండి లేదంటే మామ(ముఖ్యమంత్రి) బుల్డోజర్ సిద్ధంగా ఉందని కాంగ్రెస్ నేతలను బీజేపీకి చెందిన మధ్యప్రదేశ్ పంచాయతీరాజ్ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా హెచ్చరించారు. రఘోగర్నగర్ స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, బీజేపీలో చేరకపోతే బుల్డోజర్ సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు.
మంత్రి మాటలకు ప్రజలే బుద్దిచెప్తారని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. కాగా, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో నేరాలకు పాల్పడుతున్న వారి ఇండ్లను బుల్డొజర్లతో కూల్చివేస్తున్నామని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, బుల్డొజర్ను ఆ పార్టీ బూచిగా చూపిస్తూ ప్రశ్నించే వారిని వేధిస్తున్నదని, ఇండ్లు కూల్చేస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా, మధ్యప్రదేశ్ మంత్రి చేసిన వ్యాఖ్యలతో ఈ ఆరోపణలకు బలం చేకూరినట్లయింది.