భోపాల్, అక్టోబర్ 9: మధ్యప్రదేశ్లో అధికార బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఎన్నికల్ల గట్టెక్కేందుకు ఏకంగా ఏడుగురు ఎంపీలను బీజేపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి 2020 మార్చి మధ్య 15 నెలలు మినహా బీజేపీ గత నాలుగు పర్యాయాలుగా అధికారంలో ఉన్నది. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కమలం పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో కమలం పార్టీ ప్రధానంగా మోదీ చరిష్మానే నమ్ముకొన్నది.
రాష్ట్రంలో బీజేపీ ‘50 శాతం కమీషన్’ సర్కార్ను నడుపుతున్నదని కాంగ్రెస్ విమర్శిస్తున్నది. గత 18 ఏండ్ల బీజేపీ పాలనలో 250కి పైగా మేజర్ స్కామ్లు జరిగాయని ఆరోపిస్తూ లిస్టు విడుదల చేసింది. వీటిలో వ్యాపం రిక్రూట్మెంట్, అడ్మిషన్ స్కామ్ వంటివి ఉన్నాయి. మరోవైపు మధ్యప్రదేశ్లో నేరాలు విపరీతంగా పెరిగాయి. మహిళలపై లైంగిక దాడులు, దళితులు, గిరిజనులపై దాడుల వార్తలు నిత్యం వస్తున్న విషయం తెలిసిందే. ప్రాజెక్టు చీతాలో ఆరు చీతాలు, మూడు కూనల మరణాల అంశం కూడా బీజేపీకి ప్రతికూలం అయ్యే అవకాశం కనిపిస్తున్నది. రాష్ట్రంలో రైతాంగం, నిరుద్యోగ సమస్యలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. 2020 మార్చిలో తిరుగుబావుటా ఎగురవేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చిన ప్రస్తుత కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా తన మద్దతుదారులందరికీ టిక్కెట్లు ఇప్పించుకోవడం పెద్ద సవాల్ అని చెప్పవచ్చు.
ఓటమితో భయంతో బీజేపీ పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించుతున్నదనే విశ్లేషణలు వస్తున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత నేపథ్యంలో శివరాజ్ను వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రొజెక్టు చేసేందుకు కూడా వెనుకాడుతున్నది. గత ఆర్నెల్ల వ్యవధిలో ప్రధాని మోదీ రాష్ట్రంలో ఏడు ర్యాలీల్లో పాల్గొన్నారు.
రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకొనేందుకు బీజేపీ.. అధికారం కోసం ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రజలకు ఉచితాల హామీల ప్రకటనల్లో పోటీ పడుతున్నాయి. ప్రధానంగా ఓబీసీలు, గిరిజనులు, మహిళల ఓట్ల కోసం రెండు పార్టీలు పెనుగులాడుతున్నాయి. మహిళలను లక్ష్యంగా చేసుకొని బీజేపీ ఉచితాలను ప్రకటిస్తున్నది. ఇటీవల మహిళలకు ఆర్థిక సాయాన్ని అందించే ‘లాడ్లీ బెహనా యోజన’ పథకాన్ని ప్రారంభించారు. ఆలయాల పునఃనిర్మాణం పేరుతో హిందూత్వ కార్డును ప్రయోగిస్తున్నారు. మరోవైపు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కమల్నాథ్ ప్రత్యర్థి బీజేపీకి కౌంటర్గా రాష్ట్ర జనాభాలో 45 శాతం ఉన్న ఓబీసీ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామని, రాష్ట్రంలో కులగణన కూడా చేపడుతామని కాంగ్రెస్ చెబుతున్నది.