Ganga Vilas cruise | ప్రపంచంలోనే అత్యంత పొడవైన లగ్జరీ రివర్ క్రూయిజ్ నౌక ‘ఎంవీ గంగా విలాస్’ను ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, ప్రారంభించిన రెండు రోజులకే విహారయాత్రకు వెళ్లిన ఈ నౌక.. బీహార్లోని ఛప్రా వద్ద గంగలో నీటిలోతు తక్కువగా ఉండటం వల్ల చిక్కుకుపోయిందని వార్తలు వచ్చాయి. ఈ గంగా విలాస్ క్రూయిజ్ గంటల తరబడి ఆగిపోవడంతో అందులోని ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని, వారిని టగ్ బోట్లలో ఒడ్డుకు చేర్చారని విస్తృత ప్రచారం జరిగింది. ఈ వార్తలపై తాజాగా సంబంధిత అధికారులు స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. అనుకున్న సమయానికి నౌక పట్నాకు చేరుకుందని తెలిపారు. యాత్ర యథావిధిగా సాగుతుందని వెల్లడించింది. నీటి మట్టం విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూజ్ నౌక ‘ఎంవీ గంగా విలాస్’ను ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం వర్చువల్ మాధ్యమంలో ప్రారంభించారు. ఈ నౌక ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి మొదలై బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోని డిబ్రూగఢ్కు 51 రోజుల్లో చేరుకుంటుంది. మొత్తం 3,200 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. రెండు దేశాల్లో 27 నదుల గుండా సాగే గంగా విలాస్ ప్రయాణ మార్గంలో 50 పర్యాటక క్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంటుంది. మొత్తంగా 51 రోజుల ప్రయాణానికి ఒక్కొక్కరికి రూ.55 లక్షల టికెట్ ఉంటుంది. అంటే రోజుకు దాదాపు లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు అన్నమాట.