LPG Booking : ఎల్పీజీ సిలిండర్ బుక్ చేసుకునే విధానంలో కేంద్రం కొత్త రూల్స్ తీసుకురాబోతుంది. మే 1 నుంచి ఈ రూల్స్ అమలుకానున్నాయి. ఈ విషయంపై వినియోగదారులకు అవగాహన ఉండటం ముఖ్యం. ఎల్పీజీ బుకింగ్, డెలివరీ వంటి అంశాల్లో అమలుకాబోతున్న కొత్త రూల్స్ ఇవే. ఇకపై చమురు కంపెనీలు ప్రతి నెలా ఎల్పీజీ సిలిండర్ ధరల్ని సవరిస్తాయి.
అయితే, ఈ ధరల్ని ప్రతి నెలా ప్రారంభంలోనే ప్రకటిస్తాయి. ఏప్రిల్లో 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరను కంపెనీలు రూ.60 పెంచిన సంగతి తెలిసిందే. అలాగే, 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను మార్చి, ఏప్రిల్ నెలల్లో కలిపి రూ.300 వరకు పెంచాయి. మే నెల ప్రారంభంలో కూడా కంపెనీలు కొత్త ధరల్ని ప్రకటిస్తాయి. ప్రస్తుతం సిలిండర్ల బుకింగ్ కోసం డిమాండ్ పెరిగిన నేపథ్యంలో బుకింగ్ రూల్స్ మారబోతున్నాయి. పట్టణాల్లో రెండోసారి సిలిండర్ బుకింగ్ కోసం వినియోగదారులు ఇకపై 25 రోజులు ఆగాలి. ఇంతకుముందు ఇది 21 రోజులుగా ఉండేది.
అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో వెయిటింగ్ పీరియడ్ 45 రోజులు పెరగనుంది. బ్లాక్ మార్కెటింగ్ను నియంత్రించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. డెలివరీలో మోసాల సంగతి తెలిసిందే. కొందరు ఏజెంట్లు, సిబ్బంది గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులకు సిలిండర్ డెలివరీ చేయకుండానే, చేసినట్లు రికార్డుల్లో రాసి, ఆ సిలిండర్లను బ్లాకులో అమ్ముకుంటున్నారు. ఇకపై ఇలా తప్పుడు విధానాలకు తావులేకుండా ఓటీపీ పద్ధతిని ప్రభుత్వం తీసుకురానుంది. ఇకపై ఓటీపీ ఎంటర్ చేస్తేనే వినియోగదారులకు సిలిండర్ డెలివరీ చేసినట్లు.
ఈ విధానంలో ఇప్పటికే 94 శాతం వినియోగదారులకు సంబంధించిన నమోదు పూర్తైంది. సరఫరా, డిమాండ్లలో వ్యత్యాసాన్ని నివారించేందుకు, పారదర్శకత పెంచేందుకు కేంద్రం ఈ నిర్ణయాల్ని అమలు చేయనుంది.