శ్రీనగర్: రాముడు కేవలం హిందువులకే కాదని, ప్రపంచం మొత్తానికి చెందినవాడని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కృషి చేసిన ప్రజలందరినీ ఆయన అభినందించారు. శనివారం ఏఎన్ఐ వార్తా సంస్థతో ఫరూక్ అబ్దుల్లా మాట్లాడారు. అయోధ్యలో రామాలయం ప్రారంభానికి సిద్ధమైందని, దీని నిర్మాణానికి కృషి చేసిన వారందరికీ అభినందనలు చెబుతున్నానని అన్నారు. ‘రాముడు కేవలం హిందువులకు మాత్రమే చెందినవాడు కాదు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ఆయన చెందినవాడని నేను యావత్ జాతికి చెప్పాలనుకుంటున్నా. ప్రపంచంలోని ప్రజలందరికీ ఆయన ప్రభువు. ఇది పుస్తకాలలో రాసి ఉంది’ అని తెలిపారు.
కాగా, సోదరభావం, ప్రేమ, ఐక్యత, ఒకరికొకరు సహాయం చేసుకునే సందేశాన్ని శ్రీరాముడు ఇచ్చారని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ‘ఆయన (రాముడు) సోదరభావం, ప్రేమ, ఐక్యత, ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్న సందేశాన్ని ఇచ్చారు. మతం లేదా జాతితో సంబంధం లేకుండా అణగారిన ప్రజలను ఉద్ధరించాలని విశ్వవ్యాప్తంగా సందేశాన్ని ఇచ్చారు. ఈ ఆలయం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మన దేశంలో క్షీణిస్తున్న సోదరభావాన్ని పునరుద్ధరించాలని ఈ సందర్భంగా నేను దేశ ప్రజలకు చెప్పాలనుకుంటున్నా. ఆ సోదరభావాన్ని కొనసాగించాలని ప్రతి ఒక్కరికీ నేను చెబుతున్నా’ అని అన్నారు.
#WATCH | Poonch, J&K: Former CM of Jammu and Kashmir and National Conference leader Farooq Abdullah says, “Ayodhya Ram Temple is about to be inaugurated. I would like to congratulate everyone who made the effort for the temple. It’s ready now. I would like to tell everyone that… pic.twitter.com/V7Pb5Q8uN1
— ANI (@ANI) December 30, 2023