Amritpal Singh | ఖలిస్థాన్ (Khalistan) వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే (Waris Punjab De)’ చీఫ్ అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) పోలీసుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్న విషయం తెలిసిందే. అతని కోసం పంజాబ్ పోలీసులు (Punjab Police) గత ఐదు రోజులుగా వేట కొనసాగిస్తున్నారు. పంజాబ్తో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా ఆయన కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపడుతున్నారు. అయినప్పటికీ అతని జాడ మాత్రం తెలియట్లేదు. ఈ నేపథ్యంలో అమృత్పాల్ సింగ్పై పోలీసులు లుకౌట్ సర్క్యులర్ (Lookout Circular), నాన్బెయిలబుల్ వారెంట్ (Non Bailable Warrant) ఇష్యూ చేశారు.
ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుఖ్చైన్ సింగ్ గిల్ మాట్లాడుతూ.. అమృత్పాల్ సింగ్ను ఇంకా అరెస్టు చేయలేదని చెప్పారు. ‘ పరారీలో ఉన్న అమృత్పాల్ సింగ్పై లుకౌట్ సర్క్యులర్ (LOC), నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేశాం. మేము అతనిని అరెస్టు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము.
అతడిని త్వరలోనే పట్టుకుంటామని ఆశిస్తున్నాం… అది చెప్పడం చాలా కష్టం. పంజాబ్ పోలీసులకు ఇతర రాష్ట్రాలు, కేంద్ర సంస్థల నుంచి కూడా పూర్తి సహకారం అందుతోంది’ అని ఐజీపీ తెలిపారు.
మరోవైపు అమృత్పాల్ సింగ్ పోలీసుల కన్నుగప్పి తప్పించుకుని తిరుగుతున్నారు. అతను వివిధ వేషధారణల్లో తిరుగుతున్నట్టు పంజాబ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మేరకు వివిధ వేషధారణల్లో ఉన్న అమృత్పాల్ ఫొటోలను పోలీసులు మంగళవారం విడుదల చేశారు. క్లీన్ షేవ్, గడ్డం లేకుండా పోలీసులు ఆయన ఎలా ఉంటారనే దానిపై చిత్రాలను విడుదల చేశారు. ఈ ఫొటోలో వ్యక్తిని పోలినట్లుగా ఎవరైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పంజాబ్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిందితుడి అరెస్ట్కు సహకరించాలని కోరారు.
కాగా, ఇప్పటివరకు మొత్తం 120 మందిపైగా అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా పంజాబ్లో ఇంటర్నెట్ సేవలను మరో 3 రోజులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అమృత్పాల్.. నేపాల్, పంజాబ్, బంగ్లాదేశ్ మీదుగా విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉండడంతో కేంద్రం అప్రమత్తమైంది. మరోవైపు అమృత్పాల్ మహారాష్ట్రలోని నాందేడ్కు చేరుకునే అవకాశముందని అనుమానిస్తుండడంతో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.
అంతేకాకుండా ఇండో-నేపాల్ బోర్డర్ వద్ద పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ మార్గం గుండా అమృత్పాల్ సింగ్.. నేపాల్కు పారిపోయే అవకాశం ఉండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. నేపాల్, ఇండియా సరిహద్దు రాష్ట్రం అయిన ఉత్తరాఖండ్లో పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఉధమ్ సింగ్ నరగ్ లోని అన్ని గురుద్వారాలను, హోటళ్లను తనిఖీ చేస్తున్నారు. సరిహద్దులో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మరోవైపు అమృత్పాల్ సింగ్ తప్పించుకోవడంపై పంజాబ్ హైకోర్టు మండిపడింది. 80 వేల మంది పోలీసుల కన్నుగప్పి అతను ఎలా తప్పించుకున్నాడు అని ప్రశ్నించింది. ‘80 వేల మంది పోలీసులున్నారు.. మీరేం చేస్తున్నారు..? అమృత్పాల్ సింగ్ ఎలా ఎస్కేప్ అయ్యారు’ అని ప్రశ్నించింది. అమృత్పాల్ కోసం పంజాబ్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్పై రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది.
Also Read..
Ugadi Panchangam | ఈ రాశివారికి స్థిర ఆదాయం.. సమాజంలో గౌరవ మర్యాదలు
Usha Gokani | మహాత్మాగాంధీ మనవరాలు మృతి
CM KCR | రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు.. ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్