Lok Sabha: దేశంలో లోక్సభ ఎన్నికల కోలాహలం మొదలైంది. జాతీయ పార్టీలతోపాటు వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అధికార బీజేపీ మరికాసేపట్లో లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆ పార్టీ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ సాయంత్రం 6 గంటలకు జాబితా ప్రకటిస్తారని తెలిపాయి.
కాగా, వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం దేశంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టాయి. భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరుతో రాహుల్గాంధీ ఓ వైపు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తుండగా.. వివిధ రాష్ట్రాల్లో విజయ సంకల్ప యాత్రల పేరుతో బీజేపీ కూడా జోరుగా ప్రచారం చేస్తోంది. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కూడా లోక్సభ ఎన్నికల్లో గెలుపుపై దృష్టి సారించాయి.
తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో బీజేపీ తరఫున లోక్సభకు (Lok Sabha) పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తయినట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించింది. గురువారం రాత్రి 10:30 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున నాలుగింటి వరకు కమిటీ చర్చలు జరిపింది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో దాదాపు 16 రాష్ట్రాల నుంచి లోక్ సభ అభ్యర్థుల పేర్లను చర్చించి ఖరారు చేసినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా మొత్తం వంద స్థానాలకు తొలి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తొలి జాబితాలోనే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్లు కూడా ఉండనున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. చాలా మంది సిట్టింగ్ ఎంపీలకే మళ్లీ టికెట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.