హైదరాబాద్ : అవినీతి కేసులో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పతో పాటు ఆయన కుటుంబీకులపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు లోకాయుక్త పోలీసులు చర్యలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి తనయుడు బీవై విజయేంద్ర, ఆయన మనువడు, అప్పటి బీడీఏ కమిషనర్తో సహా బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు ఎఫ్ఐఆర్లో ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీడీఏ (Bangalore Development Authority) కాంట్రాక్టులు మంజూరు చేసేందుకు భారీగా ముడుపులు తీసుకున్నారని సామాజిక కార్యకర్త టీకే అబ్రహం ఆరోపించారు.
అయితే, కోర్టులో ఆయన ప్రైవేటు కేసు వేయగా.. కోర్టు తిరస్కరించింది. దీన్ని అబ్రహం హైకోర్టులో సవాల్ చేశారు. అవినీతి కేసును మరోసారి విచారించాలని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కర్నాటక హైకోర్టు ప్రత్యేక కోర్టును సెప్టెంబర్ 7న ఆదేశించింది. మరో వైపు న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని యడ్యూరప్ప పేర్కొన్నారు. ఈ కేసులో ఆయన కుమారుడు బీవై విజయేంద్ర, మనవడు శశిధర్, అల్లుడు సంజయ్ శ్రీ, వ్యాపారవేత్త చంద్రకాంత్ రామలింగం, ఎమ్మెల్యే, బీడీఏ మాజీ అధ్యక్షుడు ఎస్టీ సోమశంకర్, ఐఏఎస్ జీసీ ప్రకాశ్, కే రవి, విరూపాక్షప్పతో పాటు పలువురు నిందితులుగా ఉన్నారు.