న్యూఢిల్లీ, డిసెంబర్ 13: లోక్సభలో భద్రతా వైఫల్య ఘటనతో పార్లమెంట్ భద్రతా వ్యవస్థపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అత్యంత పటిష్ఠమైన బహుళ స్థాయి భద్రత వ్యవస్థ మధ్య ఉండే పార్లమెంట్లోకి విజిటర్ పాస్పై వచ్చిన దుండుగులు పొగ గొట్టాలను లోక్సభ గ్యాలరీలోకి ఎలా తీసుకెళ్లారనే దానిపై చర్చ నడుస్తున్నది. పార్లమెంట్ సభ్యులు మినహా పార్లమెంట్ ప్రాంగణంలోకి ప్రవేశించే సిబ్బంది, సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారు. ఏరియా వారీగా భద్రతను సంబంధిత సెక్యూరిటీ అధికారులకు అప్పగిస్తారు.
విజటర్ను, అతని బ్యాగ్ వంటి వస్తువులను మూడు చోట్ల తనిఖీ చేస్తారు. పార్లమెంట్ ప్రాంగణం ప్రవేశ ద్వారం మొదటగా, ఆ తర్వాత మెటల్ డిటెక్టర్ల గుండా వచ్చిన తర్వాత విజిటర్ను రెండో సారి తనిఖీ చేస్తారు. పార్లమెంట్ గ్యాలరీలోకి ప్రవేశించే ముందు మరోసారి చెకింగ్ ఉంటుంది. భద్రతా సిబ్బంది మినహా పార్లమెంట్ ప్రాంగణంలోకి ఎంపీలు కూడా ఏ విధమైన ఆయుధాలను తమ వెంట ఉంచుకొనే అధికారం ఉండదు. ఈ నేపథ్యంలో మెటల్ డిటెక్టర్లు సహా ఇంత పటిష్ఠ సెక్యూరిటీని దాటుకొని దుండగులు పార్లమెంట్ లోపలికి ఎలా చొరబడ్డారనేది ప్రశ్నగా మారింది. కాగా, దుండగులు పొగ గొట్టాలను తమ బూట్లలో దాచి తీసుకొచ్చినట్టు ప్రాథమికంగా తెలుస్తున్నది.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో సభా కార్యకలాపాలను వీక్షించేందుకు కొంత మందికి విజిటర్ పాస్లు మంజూరు చేస్తారు. ఈ గ్యాలరీ పాస్ల మంజూరు అనేది నియంత్రిత ప్రొటోకాల్లతో నిశితంగా నిర్వహించబడే ప్రక్రియ. ఈ పాస్ల కోసం కేవలం పార్లమెంట్ సభ్యులు మాత్రమే పేపర్ ఆధారిత లేదా డిజిటల్ సంసద్ వెబ్సైట్లో దరఖాస్తు చేయగలరు. ప్రతి పాస్కు ఒక ప్రత్యేక ఐడీ ఉంటుంది. ఈ పాస్ల మంజూరు విషయంలో పార్లమెంట్ సమావేశాల సమయంలో కఠిన చర్యలు అమల్లో ఉంటాయి.