న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) వచ్చే నెల 9వ తేదీ తర్వాత షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. 2019లో మాదిరిగానే ఈ సారి కూడా ఎన్నికల తేదీలు ఉండవచ్చని భావిస్తున్నారు. 2019 ఎన్నికలకు ఆ ఏడాది మార్చి 10న ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు పోలింగ్ నిర్వహించారు.
ఈ సారి కూడా దాదాపు ఇవే తేదీల్లో షెడ్యూల్, పోలింగ్ ఉండవచ్చని సమాచారం. ఈసీ ఇప్పటికే అన్ని రాష్ర్టాల్లో పర్యటించి ఎన్నికల సన్నద్ధతను పరిశీలిస్తున్నది. జమ్ముకశ్మీర్లో భద్రతా పరిస్థితులపై మార్చి 8-9 తేదీల్లో అధికారులతో ఈసీ సమావేశం కావచ్చని, లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్ని ఒకేసారి నిర్వహించటంపై మార్చి 12-13 తేదీల్లో ఈసీ సభ్యులు జమ్ముకశ్మీర్లో పర్యటించనున్నారని జాతీయ మీడియా పేర్కొన్నది.