న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లు-2023కు లోక్సభ ఆమోదం తెలిపింది. బుధవారం బిల్లుపై సభలో 8 గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టిన ఓటింగ్ తీర్మానానికి బుధవారం లోక్సభకు హాజరైన మొత్తం 456 మంది ఎంపీల్లో 454 మంది అనుకూలంగా, ఇద్దరు ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేశారు. బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు రిజర్వేషన్ల బిల్లుకు అనుకూలంగా ఓటేశాయి. మహిళా సాధికారత విషయంలో అధికార, విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపై నిలిచాయి. కొత్త పార్లమెంట్లో ఆమోదం పొందిన తొలి చారిత్రాత్మక బిల్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు నిలిచింది. బిల్లుకు వ్యతిరేకంగాఎంఐఎం పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఓటేశారు. లోక్సభ ఆమోదం తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానున్నది. అధికార బీజేపీతో పాటు విపక్ష పార్టీలు అన్నీ దాదాపు ఈ బిల్లుకు అనుకూలంగా ఉండటంతో.. పెద్దల సభలో కూడా బిల్లు ఆమోదం లాంఛనమే కానున్నది. ఉభయ సభల ఆమోదం అనంతరం రాష్ట్రపతి ముద్రతో బిల్లు చట్టంగా మారుతుంది.
కాగా, మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్సభలో మాన్యువల్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పులను సభ్యులకు అందజేశారు. అనంతరం ఓటింగ్ ప్రక్రియను లోక్సభ సెక్రటరీ ఎంపీలకు వివరించారు. బిల్లుకు మద్దతు తెలిపేవారు ‘ఎస్’ అని ఆకుపచ్చ స్లిప్పులపై రాయాలని, వ్యతిరేకించే వారు ‘నో’ అని ఎరుపు స్లిప్పులపై రాయాలని చెప్పారు. అనంతరం ఓటింగ్ చేపట్టారు. బిల్లుకు రాజ్యాంగ సవరణ అవసరం కావడంతో మాన్యువల్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు.
ఓటింగ్కు ముందు బిల్లుపై జరిగిన చర్చలో విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు మాట్లాడారు. బిల్లులోని అంశాలు, కేంద్రం బిల్లు ప్రవేశపెట్టిన ఎన్నికల సమయంపై సభ్యులు పలు అభ్యంతరాలు లేవనెత్తినప్పటికీ, మహిళా సాధికారత కోసం బిల్లుకు మద్దతిస్తున్నట్టు కాంగ్రెస్, టీఎంసీ సహా ఇతర పార్టీల ఎంపీలు పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని విపక్ష మహిళా ఎంపీలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ల కోటాలో ఓబీసీ, మైనార్టీ కోటాను కూడా చేర్చాలని పలువురు డిమాండ్ చేశారు. పదేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ బిల్లు తీసుకురాకుండా.. ఇప్పుడు లోక్సభ ఎన్నికల సమయంలో బిల్లు తేవడం ఎన్నికల జిమ్మిక్కేనని విమర్శించారు. జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన అనంతరమే రిజర్వేషన్ల అమలు అనడం సరికాదని అన్నారు.
లోక్సభలో ప్రస్తుతం ఉన్న 82 మంది మహిళా ఎంపీలకుగానూ 27 మంది బుధవారం బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. బిల్లుపై చర్చకు కేంద్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి అమిత్షా సమాధానం ఇచ్చారు. ‘కొందరు మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ కోటా గురించి మాట్లాడుతున్నారు. బిల్లులో ఓబీసీలు, ముస్లింలకు రిజర్వేషన్లు లేనందున మద్దతు ఇవ్వొద్దంటూ సోషల్ మీడియాలో కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మీరు బిల్లుకు మద్దతు తెలుపకపోతే రిజర్వేషన్లు తొందరగా వస్తాయా?’ అని అన్నారు. రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకించిన ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ఈ బిల్లు ద్వారా కేవలం అగ్రవర్ణ మహిళలకు మాత్రమే రిజర్వేషన్లు వస్తాయని అన్నారు. పార్లమెంట్లో తక్కువ ప్రాతినిధ్యం ఉన్న ఓబీసీ, ముస్లిం మహిళలకు కోటా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
నేను ఎంపీగా ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్ రావడం అదృష్టంగా భావిస్తున్నా. అయితే రిజర్వేషన్ అమలు తీరుపై మహిళలు అసంతృప్తితో ఉన్నారు. 2024 ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలి.
– ఎంపీ మాలోత్ కవిత
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతిస్తున్నది. ‘పొగలు కక్కుతున్న వంటశాల నుంచి ఫ్లడ్లైట్ల స్టేడియంల వరకు భారతీయ మహిళ ప్రయాణం సుదీర్ఘమైనది. ఆమె ఎట్టకేలకు తన గమ్యాన్ని చేరుకొన్నది’. మహిళలు వారి హక్కుల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎన్నేండ్లు వారు వేచిచూడాలి? వెంటనే మహిళలకు రిజర్వేషన్లను అమలు చేయాలి. ఇదే సమయంలో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ, ఎస్టీతో పాటు ఓబీసీ కోటాను చేర్చాలని మా పార్టీ డిమాండ్ చేస్తున్నది. కేంద్రం ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో ఆలస్యం జరిగితే, మహిళలకు అన్యాయం జరిగినట్టే. మహిళలకు రిజర్వేషన్ల బిల్లుపై మాట్లాడటం నా జీవితంలోనే ఒక ఎమోషనల్ మూమెంట్. స్థానిక సంస్థల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని నిర్ణయించేందుకు తొలిసారిగా రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. తర్వాత పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లును ఆమోదించింది. తద్వారా రాజీవ్ గాంధీ కల పాక్షికంగానే నెరవేరింది. తాజాగా బిల్లు ఆమోదం ద్వారా పూర్తిగా నెరవేరినట్టు అవుతుంది.
– సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఇన్నేండ్లకు ఆలస్యంగా తీసుకొచ్చిన ఈ బిల్లు కేవలం ఎన్నికల జిమ్మిక్కే. 2014లో అధికారంలోకి వచ్చిన కమలం పార్టీ ఇన్నేండ్లుగా బిల్లుపై ఆలోచన ఎందుకు చేయలేదు? ఇప్పుడు సరిగ్గా లోక్సభ ఎన్నికల ముందు దీన్ని తీసుకొచ్చారు. మహిళలంటే బీజేపీకి గౌరవమే ఉంటే మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? హథ్రాస్, ఉన్నావో లైంగిక దాడి, హత్య కేసుల్లో కూడా ఎందుకు చర్యలు లేవు? బీజేపీ ముందు తన మైండ్సెట్ను మార్చుకొని, తన చేతలు, మాటల ద్వారా మహిళలపై నిజమైన గౌరవాన్ని చూపాలి. ఇస్రోలో మహిళా శాస్త్రవేత్తలు, ఐఐటీ మహిళా పరిశోధకులకు వేతనాలు అందడం లేదు. 16 రాష్ర్టాల్లో బీజేపీ, దాని మిత్రపక్ష పార్టీల ప్రభుత్వాలు ఉన్నాయి. ఒక్క రాష్ట్రంలో అయినా మహిళా ముఖ్యమంత్రి ఉన్నారా? ప్రస్తుతం లోక్సభ, రాజ్యసభ టీఎంసీ ఎంపీల్లో దాదాపు 40 శాతం మంది మహిళలే ఉన్నారు. మీకు సాధ్యమైతే దాన్ని అందుకోండి!
-కకోలి ఘోష్, టీఎంసీ ఎంపీ
రిజర్వేషన్లలో ఓబీసీ, మైనార్టీ వర్గాల మహిళలకు లబ్ధి చేకూర్చాలని సమాజ్వాదీ పార్టీ డిమాండ్ చేస్తున్నది. లోక్సభ, శాసనసభలతో పాటు రాజ్యసభ, శాసనమండలికి కూడా ఈ మహిళా రిజర్వేషన్ వర్తిస్తుందా? అని అడగాలనుకొంటున్నాను. జనగణనను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చేస్తుంది? ప్రభుత్వం కులగణన ప్రక్రియను కూడా చేపడుతుందా? వీటికి సర్కార్ సమాధానం చెప్పాలి.
-డింపుల్ యాదవ్, ఎస్పీ ఎంపీ
రిజర్వేషన్ బిల్లు ద్వారా బీజేపీ మహిళలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నది. జనగణన, డీలిమిటేషన్ తర్వాతనే రిజర్వేషన్లు అమల్లోకి వస్తే.. మరి బిల్లును ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చినట్టు?. ఇది మహిళలను మోసం చేయడమే. ఇది పురుష అధిపత్య పార్లమెంట్. కేంద్రం నోట్ల రద్దు, జీఎస్టీ, లాక్డౌన్ వంటి వాటిని గంటల్లోనే చేసినప్పుడు.. మహిళా బిల్లును వెంటనే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎందుకు అమలు చేయరు?
-హర్సిమ్రత్ కౌర్ బాదల్, ఎంపీ
మహిళలను అవమానించడమే బీజేపీ మనస్తత్వం. ‘ఇంటికి వెళ్లి వంట చేసుకో. మేమంతా దేశాన్ని నడుపుతాం’ అంటూ గతంలో మహారాష్ట్ర బీజేపీ చీఫ్గా ఉన్న వ్యక్తి నన్ను ఆన్ రికార్డుగా కించపరిచారు. ఇది బీజేపీ నేతల నిజస్వరూపం. మహిళా సభ్యులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం వారి(బీజేపీ నేతల) మైండ్సెట్కు నిదర్శనం. మహిళలను కించపరిచేలా మాట్లాడిన వ్యక్తుల పక్షాన ఇండియా కూటమి ఉన్నదని ఆరోపణలు చేస్తున్న బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
-సుప్రియా సూలే, ఎన్సీపీ ఎంపీ
మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది కేవలం రిజర్వేషన్లకు సంబంధించి మాత్రమే కాదు.. ఇది పక్షపాతం, అన్యాయాన్ని తొలగించే చర్య. నియోజకవర్గాల పునర్విభజన అనంతరమే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయన్న క్లాజ్ను బిల్లు నుంచి తొలగించాలి. దీని వలన రిజర్వేషన్ల అమలులో విపరీత ఆలస్యం జరుగుతుంది. రిజర్వేషన్ల చట్టం అమలు కోసం ఎన్నేండ్లు వేచిచూడాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రిజర్వేషన్లను సులభంగా అమలు చేయొచ్చు. మాకు(మహిళలు) సెల్యూట్లు, పీఠాలు, పూజలు అవసరం లేదు.. సమానంగా గౌరవిస్తే అంతే చాలు. బిల్లులోని అంశాలు, దాని రూపకల్పనపై ఎవరితో చర్చలు జరిపారో తెలియదు? ఆఖిలపక్ష సమావేశంలో కూడా బిల్లు గురించి చెప్పలేదు. అకస్మాత్తుగా బిల్లును చాలా రహస్యంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఏ తీరున పనిచేస్తుందో ఇది చెబుతున్నది.
-కనిమొళి, డీఎంకే ఎంపీ
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సెప్టెంబర్ 19వ తేదీ(మంగళవారం) ఒక చారిత్రకమైన రోజు. రాజ్యాంగాన్ని గౌరవించే కోణంలో నుంచి చూస్తే, ఈ బిల్లు ద్వారా లక్ష్మీదేవి రాజ్యాంగ రూపాన్ని సంతరించుకొన్నది. మహిళల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు పెంచింది. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం. ప్రధాని మోదీ నాయకత్వంలో పాఠశాలల్లో బాలికల డ్రాపౌట్ రేటు కూడా తగ్గింది.
-కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
‘జనగణన, డీలిమిటేషన్ ప్రక్రియకు లింకు పెట్టకుండా మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలి. రిజర్వేషన్ల అమలును ఆలస్యం చేసే నిబంధనలు ఉపసంహరించుకోవాలి. బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నాయి.
-బీఎస్పీ అధినేత్రి మాయావతి
‘ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మహిళా బిల్లును కేంద్రం తీసుకొచ్చింది.. కేంద్రానికి చిత్తశుద్ధి లేదు. లేదంటే వెంటనే బిల్లును ఆమోదించి, రిజర్వేషన్లను అమలు చేసేవారు. డీలిమిటేషన్ దక్షిణాదిపై వేలాడుతున్న కత్తి.
– తమిళనాడు సీఎం స్టాలిన్
వచ్చే లోక్సభ ఎన్నికల్లో లబ్ధికే బీజేపీ మహిళా రిజర్వేషన్ల బిల్లును తీసుకొచ్చింది. జనగణన, డీలిమిటేషన్తో సంబంధం లేకుండా ఈ బిల్లును తక్షణమే ఎందుకు అమల్లోకి తీసుకురావడం లేదు? మహిళా బిల్లుకు జనగణన, డీలిమిటేషన్తో లింక్ చేశారు. వాటితో సంబంధం లేకుండా రేపొద్దున్నే అమల్లోకి తీసుకురండి. మేం మద్దతుగా నిలుస్తాం. 2014లోనూ మేం సిద్ధంగానే ఉన్నాం. 2014లోనే ఈ బిల్లును తీసుకొచ్చి ఉంటే.. ఇప్పటికే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చేవి. మహిళా రిజర్వేషన్లు అమలు చేసే ఉద్దేశం బీజేపీకి లేదు. 2029లో కూడా ఇది అమలు కాదు. 2024 ఎన్నికల కోసమే దీన్ని తీసుకొచ్చారు.
-కపిల్ సిబల్, ఎంపీ