Lok Sabha : వచ్చే వారం లోక్సభలో స్పీకర్పై కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం పెట్టబోతుంది. ఈ నేపథ్యంలో ఈ తీర్మానంపై ఉత్కంఠ నెలకొంది. అందుకే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. ప్రతి ఒక్కరూ సభలో చర్చ, ఓటింగ్ సందర్భంగా అందుబాటులో ఉండాలని ఆదేశించాయి. లోక్సభ స్పీకర్ ఓంబిర్లాను పదవి నుంచి తొలగించాలని కోరుతూ గత నెలలోనే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చాయి.
దీనిపై ఈనెల 9, 10 తేదీల్లో చర్చ, అనంతరం ఓటింగ్ జరగనుంది. అందువల్ల ఈ రెండు రోజుల్లో తమ ఎంపీలు అందరూ సభకు హాజరవ్వాలని, అందుబాటులో ఉండాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. ఈ మేరకు తమ ఎంపీలు సభలో ఉండి, ప్రభుత్వానికి మద్దతు తెలపాలని బీజేపీ సూచించింది. స్పీకర్ ఓంబిర్లా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని కోరుతూ గత నెలలో ప్రతిపక్షాలకు చెందిన 118 మంది ఎంపీలు సంతకాలు చేసి, నోటీసులు ఇచ్చారు. అయితే, నోటీసు ఇచ్చిన తర్వాత నుంచి సభ వాయిదా పడి కార్యకలాపాలు నిలిచిపోయాయి. కేంద్ర బడ్జెట్పై రెండో దశ సమావేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి దశ సమావేశాలు అర్ధాంతరంగా వాయిదాపడ్డాయి. సభలో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో సమావేశాల్ని వాయిదా వేశారు.
రెండో దశ బడ్జెట్ సమావేశాల్లోనే ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెడతారు. తర్వాత దీనిపై చర్చ, ఓటింగ్ ఉంటాయి. ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు స్పీకర్ చైర్లో ఓం బిర్లానే ఉంటారు. సోమవారం ప్రారంభం కానున్న చర్చ సమయంలో మాత్రం ఆయన సాధారణ ఎంపీలాగే సభలో కూర్చుంటారు. పార్లమెంట్ నిబంధనల ప్రకారం ఒక ఎంపీగా.. తన స్పీకర్ పదవిని రక్షిస్తూ మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. తాజా సమావేశాలు ఏప్రిల్ 2 వరకు జరుగుతాయి.