Varun Gandhi | లోక్సభ తొలిదశ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నది. ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలైంది. ప్రస్తుతం యూపీలోని ఫిలిబిత్ నియోజకవర్గంపై అందరి దృష్టి నెలకొన్నది. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా సంజయ్ గాంధీ కొనసాగుతున్నారు. బీజేపీ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఈ సారి ఎన్నికల్లో ఆయనకు కాషాయ పార్టీ టికెట్ను నిరాకరించింది. ఆయన స్థానంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జితిన్ ప్రసాదకు టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 27న ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ల పర్వం బుధవారంతో ముగియనున్నది.
ఈ క్రమంలో ఆయన సైలెంట్గా ఉంటూ వస్తున్నారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా? నామినేషన్ వేస్తారా? లేదా స్పష్టత రాలేదు. ఈ పరిస్థితుల్లో వరుణ్ గాంధీ ఫిలిబిత్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని వదులుకుంటారా? అనే చర్చ జరుగుతున్నది. గత నాలుగు పర్యాయాలుగా ఫిలిబిత్ నియోజకవర్గంలో బీజేపీ గెలుస్తూ వస్తున్నది. దాదాపు మూడు దశాబ్దాలుగా గాంధీ కుటుంబం ఇక్కడ ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నది. వరుణ్ గాంధీ ఇక్కడి నుంచి రెండుసార్లు ఎంపీగా పోటీ చేశారు. అంతకు ముందు ఆయన తల్లి మేనకా గాంధీ ఆరుసార్లు ఎంపీగా గెలుపొందారు.
2009 లోక్సభ ఎన్నికల్లో వరుణ్ గాంధీ తొలిసారిగా పిలిభిత్ నుంచి ఎంపీ అయ్యారు. 2014లో బీజేపీ ఆయనను సుల్తాన్పూర్ నుంచి బరిలోకి దిపింది. అక్కడ ఆయన గెలుపొందారు. మళ్లీ 2019లో మళ్లీ పిలిభిత్ స్థానం నుంచి పోటీ చేసి మళ్లీ ఎంపీగా విజయం సాధించారు. వరుణ్ గాంధీ ఇటీవల గతంలో ఎన్నడూ లేనివిధంగా సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ మధ్య విమర్శలు తగ్గించారు. ఈ క్రమంలో బీజేపీ టికెట్ ఇస్తుందా? లేదా ? అనే ఊహాగానాలున్నాయి. చివరకు అనుకున్నట్లుగానే కాషాయ పార్టీ వరుణ్ గాంధీకి టికెట్ నిరాకరిస్తూ జితిన్ ప్రసాద వైపు మొగ్గు చూపుతూ టికెట్ ఇచ్చింది.
ప్రస్తుతం వరుణ్ గాంధీ ఏం నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా? లేదంటే ఎన్నికలకు దూరంగా ఉంటారా? అనే ఆస్తకికరంగా మారింది. ఇక జితిన్ ప్రసాద్ 2004 లోక్సభ ఎన్నికల్లో షాజహాన్పూర్ నుంచి కాంగ్రెస్ టికెట్పై గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ధౌరహర స్థానం నుంచి విజయం సాధించి కేంద్రమంత్రిగా పని చేశారు. 2021లో ఆయన కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. ప్రస్తుతం యోగి నేతృత్వంలోని యూపీ ప్రభుత్వంలో పబ్లిక్ వర్క్స్ మినిస్టర్గా కొనసాగుతున్నారు.