K S Eshwarappa | కర్ణాటకలో బీజేపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కేఎస్ ఈశ్వరప్పపై పార్టీ నాయకత్వం బహిష్కరణ వేటు వేసింది. సార్వత్రిక ఎన్నికల్లో తన కొడుకు కాంతేశ్కు హవేరీ టికెట్ ఇవ్వకపోవడంతో అసంత్రుప్తితో పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు చేశారు. గతంలో రాజకీయాలకు ప్రకటించిన రిటైర్మెంట్ను పక్కన బెట్టి శివమొగ్గ లోక్ సభా స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఈశ్వరప్ప వ్యవహార శైలిని బీజేపీ కేంద్ర నాయకత్వం సీరియస్ గా తీసుకున్నది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు ఈశ్వరప్పను ఆరేండ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది.
శివమొగ్గ అసెంబ్లీ స్థానం నుంచి కేఎస్ ఈశ్వరప్ప ఐదుసార్లు గెలుపొందారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తన కొడుక్కి టికెట్ వచ్చేలా చూస్తానని మాట ఇచ్చి మోసగించారని మాజీ సీఎం యెడియూరప్పపై ఈశ్వరప్ప గుర్రుగా ఉన్నారు. శివమొగ్గ నుంచి యెడియూరప్ప కొడుకు బీవై రాఘవేంద్ర పోటీ చేస్తున్నారు. తన కొడుక్కి టికెట్ రాకపోవడానికి యెడియూరప్పనే కారణం అని ఆరోపించారు ఈశ్వరప్ప. తండ్రీకుమారుల నియంత్రణ నుంచి పార్టీకి విముక్తి కలిగించడానికే తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి ఈశ్వరప్పను బుజ్జగించారు. కానీ ఈశ్వరప్ప తప్పుకోక పోవడంతో ఆయనపై బీజేపీ అధిష్టానం బహిష్కరణ వేటు వేసింది.