EC | న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం భారీగా పట్టుపడుతున్నాయి. మార్చి 1 నుంచి ఈ నెల 15 వరకు దేశవ్యాప్తంగా 45 రోజుల వ్యవధిలో రూ.4,650 కోట్ల విలువైన డబ్బు, మద్యం, ఇతర తాయిలాలు, మాదకద్రవ్యాలను సీజ్ చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది. ఇందులో ఏకంగా రూ.2,069 కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నాయని, ఇది మొత్తంలో 45 శాతమని ఈసీ తెలిపింది. 2019 ఎన్నికలతో (రూ.3,475 కోట్లు) పోలిస్తే ఈసారి పట్టుబడింది చాలా ఎక్కువని పేర్కొన్నది.
గత నెల 1 నుంచి దేశవ్యాప్తంగా జరిపిన సోదాల్లో భాగంగా రోజుకు సగటున రూ.100 కోట్లు విలువైన వాటిని స్వాధీనం చేసుకొన్నామని ఈసీ వెల్లడించింది. మొత్తం సీజ్ చేసిన రూ.4,658 కోట్ల విలువైన వాటిలో నగదు రూ.395 కోట్లు, మద్యం వాటా రూ.489 కోట్లకు పైగా ఉంటుందని పేర్కొన్నది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో సీజ్ చేసిన మొత్తంలో 75 శాతం మాదకద్రవ్యాలే ఉన్నాయని ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారంలో రాజకీయ నేతలకు సహకరిస్తున్న 106 మంది ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తీసుకొన్నట్టు ఈసీ ఈ సందర్భంగా పేర్కొన్నది. కాగా, హెలికాప్టర్లో సోదాలు చేయడం కొత్తేం కాదని, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ విషయంలో కూడా అదే జరిగిందని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.
తమిళనాడులో 900 కోట్ల బంగారం పట్టివేత
తమిళనాడులో 1,425 కిలోల బంగారం కడ్డీలను ఎన్నికల ఫ్లైయింగ్ స్కాడ్ అధికారులు సీజ్ చేశారు. శనివారం శ్రీపెరంబుదూర్ నియోజకవర్గంలో వండలూర్కు సమీపంలో ఓ వ్యాన్ను అడ్డుకొని తనిఖీలు జరపగా భారీ మొత్తంలో బంగారం కడ్డీలు పట్టుబడ్డాయి. వీటి విలువ సుమారుగా రూ.900 కోట్లకుపైగా ఉంటుందని, 400 కిలోల బంగారానికి మాత్రమే రశీదులు, కస్టమ్స్ పత్రాలు ఉన్నాయని అధికారులు చెప్పారు. ‘వ్యాన్ వెంట సాయుధులైన భద్రతా సిబ్బంది ఉన్నారు. తాము ఓ నగదు మేనేజ్మెంట్ కంపెనీకి చెందిన వారిమని వాహనాల్లోని వ్యక్తులు చెప్పారు’ అని ఎన్నికల అధికారులు వెల్లడించారు. 1,025 కిలోల బంగారానికి లెక్కాపత్రం లేదని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.