న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరీ ఘటనపై విపక్షాల ఆందోళనతో ఇవాళ లోక్సభ ( Lok Sabha ) దద్ధరిల్లింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తన పదవికి రాజీనామా చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. స్పీకర్ తమ నినాదాలను లెక్కచేయకుండా సభా కార్యకలాపాలను కొనసాగించడంతో.. ఆందోళన చేస్తున్న ఎంపీలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. దాంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొన్నది.
దాంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించలేదు. మళ్లీ విపక్ష ఎంపీలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి తమ ఆందోళన కొనసాగించారు. ఆందోళన చేస్తున్న సభ్యులు వెనక్కి వెళ్లి వారివారి స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ ఎంత చెప్పినా విపక్షాలు లెక్కచేయలేదు. దాంతో సభాపతి సభను సోమవారానికి వాయిదా వేశారు.