CBI | తమిళనాడు, తెలంగాణ సహా పది రాష్ట్రాలు కేసులు దర్యాప్తు చేసేందుకు సీబీఐకి ఇచ్చిన సమ్మతిని ఉప సంహరించుకున్నాయని కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్సభకు తెలిపింది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (DSPE) చట్టం, 1946లోని సెక్షన్ 6 ప్రకారం.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) తన అధికార పరిధిలో దర్యాప్తు చేసేందుకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి అవసరం. డీఎస్పీఈ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం సీబీఐని ఏర్పాటు చేశారు. ఈ నిబంధన ప్రకారం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అనుమతి సీబీఐ దర్యాప్తు చేపట్టలేదు. బీజేపీయేతర రాష్ట్రాల్లో రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం సీబీఐని ఉసిగొల్పుతుందని ఆరోపిస్తు పది రాష్ట్రాలు సీబీఐకి ఇచ్చిన సాధారణ అనుమతిని ఉపసంహరించుకున్నాయి.
పంజాబ్, జార్ఖండ్, కేరళ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, మిజోరాం, తెలంగాణ, మేఘాలయ, తమిళనాడు రాష్ట్రాలు తమ సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నాయని ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. సీబీఐకి మరిన్ని అధికారాలను అప్పగించేలా కేంద్రం ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్లాబ్లిష్మెంట్ చట్టంలోని సెక్షన్ 6ని సవరించాలని ప్రతిపాదిస్తున్నదా? అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. సెక్షన్ 6ని సవరించాలనే ప్రతిపాదన లేదన్నారు. సీబీఐకి మరిన్ని అధికారాలను అప్పగించేలా కొత్తచట్టం చేయాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. కేసుల దర్యాప్తులో రాష్ట్రాల సమ్మతి, జోక్యంతో పనిలేకుండా దర్యాప్తు చేసే అధికారాన్ని ఇచ్చేలా ఈ చట్టం ఉండాలని పేర్కొంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు వివక్షకు గురవుతున్నామనే భావన కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థాయీ సంఘం సూచించింది.