ముంబై: ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకపోతే మహారాష్ట్రలో మళ్లీ లాక్డౌన్ తప్పదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే హెచ్చరించారు. ఆదివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ప్రసంగిస్తూ.. కరోనా మహమ్మారితో పోరాటం కూడా స్వాతంత్ర్య పోరాటం లాంటిదేనని వ్యాఖ్యానించారు. ఈ మధ్య కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో కొవిడ్ ఆంక్షలను ఎత్తివేశామని, ప్రజలు సరిగా నిబంధనలు పాటించకపోతే వైరస్ మళ్లీ విజృంభిస్తుందని, అదేగనుక జరిగితే మళ్లీ ఆంక్షలు విధించక తప్పదని ఉద్ధవ్ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆంక్షలు ఎత్తివేసినందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఉద్ధవ్ థాకరే సూచించారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మహమ్మారి మళ్లీ ప్రబలే ప్రమాదం ఉన్నదన్నారు. నిరంతరం వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా, సరిపడా ఔషధాలు అందుబాటులో ఉన్నా.. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం లాంటి కరోనా నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. లేదంటే కేసులు పెరుగుతాయని, అప్పుడు మళ్లీ ఆంక్షలు విధించాల్సి వస్తుందని అన్నారు.