Odisha Train Accident | బాలాసోర్, హౌరా, జూన్ 3: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో బాధితులను రక్షించడంలో స్థానికులు కీలక పాత్ర పోషించారు. స్వచ్ఛందంగా క్షత్రగాత్రులకు అవసరమైన రక్తదానం చేసి మానవత్వాన్ని చాటారు. అర్ధరాత్రి వేళ వందలాది స్థానికులు బాలాసోర్ ప్రభుత్వ దవాఖానలో గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడి ప్రమాద బాధితులకు అవసరమైన రక్తాన్ని దానం చేశారు.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే కొందరు స్థానికులు ఒట్టి చేతులతోనే సహాయక చర్యలు ప్రారంభించారు. అందుబాటులో ఉన్న వాహనాల్లో గాయపడ్డవారిని సమీప దవాఖానలకు తరలించారు. వయస్సు రీత్యా రక్తదానం చేయలేని వృద్ధులు బాధితుల బంధువులకు ఫోన్లు చేయడంలో సహాయపడ్డారు. ప్రమాదంలో అయినవారిని కోల్పోయిన చిన్నారుల సంరక్షణ బాధ్యతను తీసుకున్నారు.