Ayodhya | అయోధ్య రామాలయంలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరుగనున్నది. ఈ వేడుకలకు ఓ వైపు చకాచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. మరో వైపు శ్రీరామజన్మభూమి తీర్థకేత్ర ట్రస్ట్ వేడుకకు హాజరుకావాలని ప్రముఖులకు ఆహ్వానాలను పంపుతున్నది. అయితే, బీజేపీ కురువృద్ధులు, అయోధ్య రామ మందిరం ఉద్యమానికి ఊపిరిలూదిన ఎల్ అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు సైతం ట్రస్ట్ ఆహ్వానాలను పంపింది. ఆహ్వానపత్రిలకు విశ్వహిందూ పరిషత్ సీనియర్ నేతలకు అందించింది.
అయితే, ఇంతకు ముందు ప్రారంభోత్సవ వేడుకలకు రావొద్దంటూ ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. ఇద్దరు నేతల వయసు, ఆరోగ్యం తదితర కారణాలుగా చూపింది. కార్యక్రమానికి హాజరుకావొద్దని కోరితే.. తమ విజ్ఞాపనను అంగీకరించినట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. అయితే, రామ జన్మభూమి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు నేతలను రావొద్దని చెప్పడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో విశ్వహిందూ పరిషత్ ఇద్దరు నేతలను కలిసి ఆహ్వానాలను అందించగా.. చారిత్రాత్మక వేడుకలకు హాజరయ్యేందుకు అంగీకరించారని వీహెచ్పీ అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు.
రామమందిర ఉద్యమానికి మార్గదర్శకులు అద్వానీ, మురళీ మనోహర్ జోషి కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించామని.. వచ్చేందుకు తమవంతు ప్రయత్నం చేస్తామని చెప్పినట్లుగా అలోక్ కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం లాల్ కృష్ణ అద్వానీ వయసు (96) సంవత్సరాలు కాగా.. వచ్చే నెలలో మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి 90వ పడిలోకి అడుగిడబోతున్నారు. ఇద్దరు నేతలు రామ మందిరం ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత చివరకు నవంబర్ 9, 2019న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. వివాదాస్పద స్థలంలో రామాలయం నిర్మాణానికి సమ్మతించింది.. మసీదు నిర్మాణానికి ముస్లింలకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని తీర్పునిచ్చింది. ఆ తర్వాత ఆలయ నిర్మాణానికి పునాది రాయి వేయగా.. జనవరి 22న ఆలయంలో ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 16న వేడుకలు మొదలై.. అదే నెల 22న ముగియనున్నాయి.
జనవరి 15 నాటికి వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేర్కొన్నారు. 22న గర్భాలయంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరుగనుండగా.. ప్రధాని మోదీ హాజరవనున్నారు. ఈ వేడుకకు దలైలామా, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ముఖేష్ అంబానీతో పాటు నటీనటులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరవనున్నారు. మరో వైపు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ నేపథ్యంలో దేశమంతా వేడుకలు నిర్వహించనున్నారు.