Ram Mandir | కోట్లాది మంది భారతీయుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 22న అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన కార్యక్రమం జరుగనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన చేయనుండగా.. దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే, అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని యావత్ భారతదేశంతో పాటు విదేశాల్లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
అమెరికా న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ టైమ్ స్క్వేర్లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనుండడం విశేషం. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ వేడుకను వివిధ దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాల్లోనూ ప్రసారం చేయనున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. వేడుకకు సంబంధించిన సన్నాహాలను ప్రధాని మోదీ నిశితంగా పరిశీలిస్తుండగా.. ఈ సందర్భంగా అనుసరించాల్సిన ఆచారాలు, నియమాలపై సవివరంగా తెలుసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
అయోధ్య రామాలయంలో రాంలాలా విగ్రహ ప్రతిష్ఠకు 84 సెకన్ల పాటు శుభ సమయం నిర్ణయించారు. జనవరి 22న ఉదయం 12.29 గంటల నుంచి 12.30 గంటల మధ్య శుభహుమూర్తం ఉన్నది. గర్భాలయంలో ఐదేళ్ల బాలుడిగా శ్రీరాముడు దర్శనమివ్వనున్నారు. రాంలాల విగ్రహాన్ని కర్నాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. అదే సమయంలో ప్రస్తుతం చిన్న ఆలయంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని పాత విగ్రహంతో పాటు గర్భాలయంలో ప్రతిష్టించనున్నారు. ఇక ఆలయం ఆలయం పొడవు (తూర్పు నుంచి పడమర) 380 అడుగులు, వెడెల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు ఉంటుంది. ఈ ఆలయం మూడు అంతస్తులు ఉండగా.. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆలయంలో 392 స్తంభాలు ఉండగా.. 44 తలుపులుంటాయి.