Air Pollution | దేశంలో ఈ ఏడాది కాలుష్యం తీవ్రంగా పెరిగిపోయిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. ఈ ఏడాది దేశంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాను తాజాగా విడుదల చేసింది. మనం పీల్చే గాలి నాణ్యత రోజు రోజుకూ క్షీణిస్తోందని బోర్డు తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. వాహనాల నుంచి వచ్చే పొగతో పాటు పంట పొలాల్లోని వ్యర్థాలను తగలబెట్టడం వంటి చర్యలతో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతోందని తెలిపింది. కాగా, ఈ ఏడాదికిగాను అత్యంత కాలుష్య నగరాల జాబితాలో బీహార్లోని కతిహార్ తొలిస్థానంలో నిలిచిందని పేర్కొంది.
కతిహార్లో గాలి నాణ్యత (ఏక్యూఐ) 360 పాయింట్లకు చేరిందని కాలుష్య నియంత్రణ బోర్డు నివేదికలో పేర్కొంది. దీని తర్వాతి స్థానంలో ఢిల్లీ (354), నోయిడా(328), ఘజియాబాద్(304) నగరాలు ఉన్నాయని తెలిపింది. ఇక, బెగుసరాయ్, బల్లాబ్ గఢ్, ఫరీదాబాద్, కైతాల్, గురుగ్రామ్, గ్వాలియర్ నగరాలు కూడా అత్యంత కాలుష్య నగరాలని ఈ నివేదిక తేల్చింది.
మరోవైపు పంజాబ్ లో పంట పొలాల వ్యర్థాల కాల్చివేతలు పెరుగుతున్నాయని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐఏఆర్ఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల ఒక్క రోజులోనే పంట వ్యర్థాల కాల్చివేత ఘటనలు మొత్తం 3,634 గుర్తించినట్లు తెలిపింది. పంట వ్యర్థాల కాల్చివేత కారణంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం పెరుగుతోందని పేర్కొంది.
https://cpcb.nic.in//upload/Downloads/AQI_Bulletin_20221107.pdf