న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నుంచి శివారులోని ఉత్తర ప్రదేశ్ నోయిడాకు మద్యం భారీగా అక్రమ రవాణా జరుగుతోంది. ఢిల్లీలో లిక్కర్పై భారీగా డిస్కౌంట్లు ఇస్తుండటమే దీనికి కారణం. మద్యం షాపులకు రిటైల్ ధరపై గరిష్ఠంగా 40 శాతం వరకు తగ్గింపునకు ఢిల్లీ ఎక్సైజ్ విభాగం అనుమతించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో మద్యం ధరలపై 25 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతో దేశ రాజధాని నుంచి సమీప రాష్ట్రాలకు భారీగా మద్యం అక్రమంగా రవాణా అవుతున్నది. ముఖ్యంగా ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తర ప్రదేశ్లోని నోయిడాకు లిక్కర్ స్మగ్లింగ్ పెద్ద ఎత్తున జరుగుతోంది. దీంతో నోయిడా ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది. మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు తనిఖీలను ముమ్మరం చేసింది. ఈ నెల 6 వరకు 20 వాహనాలను సీజ్ చేసింది. మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న 45 మందిని అరెస్ట్ చేసింది.
కాగా, ఢిల్లీలో మద్యంపై డిస్కౌంట్ల వల్ల అక్రమ రవాణాతోపాటు అరెస్టులు గత నెల కంటే రెట్టింపు అయ్యాయని నోయిడా ఎక్సైజ్ శాఖ అధికారి ఆర్బీ సింగ్ తెలిపారు. అలాగే స్థానికులు కూడా డబ్బులు ఆదా చేసుకునేందుకు సరిహద్దులు దాటి ఢిల్లీకి వెళ్లి మద్యం కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి గౌతమ్ బుద్ధ్నగర్ జిల్లా మీదుగా ఉత్తరప్రదేశ్కు లిక్కర్ స్మగ్లింగ్ బాగా పెరిగిందని వెల్లడించారు. దీనిని అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలను ముమ్మరం చేసినట్లు వివరించారు.