బెంగళూర్ : జులై 26న ముఖ్యమంత్రిగా వైదొలగుతానని కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్ప సంకేతాలను పంపడంతో లింగాయత్ వర్గానికి చెందిన వివిధ మఠాధిపతులు, సన్యాసులు భగ్గుమంటున్నారు. యడియూరప్పకు ఇప్పటికే పలువురు స్వామీజీలు మద్దతు పలకగా ఆయనపై కాషాయ పార్టీ అగ్రనేతలు కుట్రపన్నారని తాజాగా కొత్తూర్ వీరశైవ శివయోగ మందిర్ స్వామీజీ సంగన బసవ స్వామి సంచలన ఆరోపణలు చేశారు. యడియూరప్పను దించేందుకు బీజేపీ హైమాండ్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
కాగా ఈ నెల 25 వరకూ తాను వేచిచూస్తానని తదుపరి సీఎం ఎవరనేదానిపై కేంద్ర నేతలే ఓ నిర్ణయం తీసుకుంటారని యడియూరప్ప వ్యాఖ్యానించారు. పార్టీ అగ్రనాయకత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ల ఆదేశాలు పాటించడం తమ బాధ్యతని అన్నారు. చివరినిమిషం వరకూ తాను రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతానని, ఆపై బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తానని యడియూరప్ప పేర్కొన్నారు.