సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రజలకు పరిశుభ్రమైన, నాణ్యమైన మాసంను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతోనే చెంగిచెర్లలో అధునాతన స్లాటర్ హౌస్ను ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. స్లాటర్ హౌస్ పరిధిలోని గొర్రెలు, మేకల విక్రయదారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బోడుప్పల్ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్, లీగల్ అడ్వైజరీ శేఖర్ యాదవ్, మొండెదారుల సంఘం అధ్యక్షుడు నవీన్యాదవ్, జాల నర్సింహయాదవ్ సోమవారం మంత్రి శ్రీనివాస్ యాదవ్ను మాసాబ్ట్యాంక్లోని ఆయన చాంబర్లో కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
వెంటనే స్పందించిన మంత్రి పశు సంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, గొర్రెల, మేకల అభివృద్ధి సహకార సంస్థ ఎండీ రాంచందర్, డైరెక్టర్ లక్ష్మారెడ్డిలతో కలిసి సమావేశం నిర్వహించారు. షెడ్డుల నిర్మాణం, తాగునీటి సరఫరా, టాయిలెట్స్ నిర్మాణం వంటి సమస్యలపై చర్చించారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్లాటర్ హౌస్ పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరంతర పర్యవేక్షణ కొరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు.