గ్వాలియర్, నవంబర్ 7: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ (ప్రధాన ప్రచారకర్త) అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. ఇక కేంద్ర సంస్థలు సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) కూడా బీజేపీ తరఫున పోరాటంలో భాగస్వాములేనని విమర్శించారు.
మధ్యప్రదేశ్లో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఒకరే పోటీ చేస్తుండగా, బీజేపీ మాత్రం నలుగురితో రంగంలో దిగుతున్నదని విమర్శించారు.
అందులో ఒకరు భౌతికంగా మనకు కన్పించే బీజేపీ అభ్యర్థి కాగా, మన కంటికి కన్పించకుండా అతని వెనుక స్టార్ క్యాంపెయినర్ ఈడీతో పాటు సీబీఐ, ఐటీ శాఖలు ఉంటున్నాయని ఖర్గే పేర్కొన్నారు. ఈ మూడే కాక, ప్రధాని మోదీ, మధ్యప్రదేశ్ ఎంపీ చౌహాన్ కూడా తోడై పంచ పాండవుల్లా కాంగ్రెస్ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నారని ఖర్గే ఆరోపించారు. అయితే వీరందరికీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తగిన విధంగా బుద్ధి చెబుతుందని అన్నారు.