Life Insurance | మకరవిళక్కు వేడుకల కోసం త్వరలోనే శబరిమల ఆలయ ద్వారాలు తెరచుకోనున్నాయి. ఈ క్రమంలో అయ్యప్ప భక్తులకు సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీపికబురు చెప్పింది. భక్తులకు ఉచిత బీమా కవరేజీని వర్తింపజేయాలని నిర్ణయించింది. సీఎం అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలయానికి వెళ్లే సమయంలో ప్రాణాలు కోల్పోయిన భక్తులకు రూ.5లక్షల బీమాను వర్తింపజేస్తారు. అలాగే, మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అధికారులే ఏర్పాట్లు చేయనున్నారు. దేవాలయాలను నిర్వహించే ట్రావెన్కోర్ దేవస్వం బోర్డ్ ఈ స్పెషల్ బీమా కవరేజీ పథకానికి బీమా ప్రీమియం చెల్లించనున్నది. రెండునెలల మకరవిళక్కు ఈ నెల 16న మొదలవనున్నది. డిసెంబర్ చివరివారం వరకు కొనసాగుతుంది. కొద్దిసేపు ఆలయాన్ని మూసివేసి మళ్లీ జనవరి మూడో వారం వరకు భక్తుల కోసం ఆలయాన్ని తెరుస్తారు.
ఈ సారి రికార్డుస్థాయిలో 14వేల మంది పోలీసు సిబ్బంది, వలంటీర్లు, భద్రతలో మోహరించాలని నిర్ణయించారు. సమీక్ష సమావేశానికి పలువురు మంత్రులతో పాటు ఆయాశాఖల అధికారులు హాజరయ్యారు. యాత్రికుల కోసం పార్కింగ్ సదుపాయాన్ని 10వేల స్లాట్లకు పెంచారు. అలాగే, టెంపుల్ టౌన్, చుట్టుపక్కల ఉన్న అన్ని రెస్టారెంట్లలో అన్ని దక్షిణ భారత భాషల్లో రేట్కార్డులు ఏర్పాటు చేయనున్నారు. ఆలయ పట్టణం, పరిసరాల్లో భక్తులకు వైద్యసేవలు అందించనున్నారు. శబరిమలకు వచ్చే ఒక్క భక్తుడు సైతం స్వామివారి దర్శనం కాకుండానే తిరిగి వెళ్లకుండా ఏర్పాట్లు చేస్తామని మంత్రి వీఎన్ వాసవన్ పేర్కొన్నారు. వర్చువల్ క్యూ బుకింగ్ మొదలైంది.. ఆన్లైన్లో బుక్ చేసుకోని వారికి రోజుకు 10వేల దర్శనం టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. భక్తులు శబరిమల యాత్రను సజావుగా జరుపుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సముద్రమట్టానికి 914 కిలోమీటర్ల ఎత్తులో పశ్చిమ కనుమల పర్వత శ్రేణుల్లో శబరిమల ఆలయం ఉన్నది. పతనంతిట్ట జిల్లాలోని పంబా నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.