Library | న్యూఢిల్లీ, ఆగస్టు 9: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కన్ను దేశంలోని గ్రంథాలయాలపై పడినట్టు తెలుస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్న లైబ్రరీలను రాష్ర్టాల జాబితా నుంచి ఉమ్మడి జాబితాకు మార్చే యోచనలో మోదీ సర్కార్ ఉన్నదని, కేంద్ర సాంసస్కృతిక శాఖ పార్లమెంట్లో బిల్లు పెట్టే ప్లాన్లో ఉన్నదని సమాచారం. ఈ మేరకు ఇటీవల ఢిల్లీలో జరిగిన ‘ఫెస్టివల్ ఆఫ్ లైబ్రరీస్’ కార్యక్రమంలో రాజారామ్ మోహన్రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ డైరెక్టర్ జనరల్ అజయ్ ప్రతాప్ సింగ్ సంకేతం ఇచ్చారని కేరళ స్టేట్ లైబ్రరీ కౌన్సిల్ ప్రతినిధి పీవీకే పనయాల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానాలు ఆమోదించాలని ప్రతాప్ సింగ్ కోరారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను కేరళ, కర్ణాటక తదితర రాష్ర్టాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గ్రంథాలయాలను ఉమ్మడి జాబితాలోకి మారిస్తే, వాటి నిర్వహణ తీరు పూర్తిగా మారిపోతుందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. విజ్ఞాన వ్యాప్తిని బీజేపీ నియంత్రిస్తుందని, దేశంలో సంఘ్ పరివార్ భావజాలాన్ని మరింతగా వ్యాప్తి చేసేందుకు లైబ్రరీలను సాధనంగా చేసుకొంటుందని, ఈ అజెండాలో భాగంగానే లైబ్రరీలను ఉమ్మడి జాబితాలోకి తెచ్చే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేరళ లైబ్రరీ కౌన్సిల్ కార్యదర్శి వీకే మధు మాట్లాడుతూ లైబ్రరీలను ఉమ్మడి జాబితాలోకి చేర్చే అంశంపై కేంద్రం చట్టం చేస్తే గనుక, సంఘ్ పరివార్ భావజాలాన్ని వ్యాప్తి చేయించే పుస్తకాలను బలవంతంగా కొనాల్సి ఉంటుందని, శాస్త్రీయ, హేతుబద్ధ పుస్తకాలు ప్రాధాన్యతా లిస్టు నుంచి పక్కకుపోతాయని మధు అభిప్రాయపడ్డారు.
విజ్ఞానవ్యాప్తిని నియంత్రించడంతోపాటు, తిరోగమన ఆలోచనలకు బీజాలు వేసేందుకు కేంద్రం ఈ ఆలోచన చేస్తున్నదని కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు అన్నారు. లైబ్రరీలు అనేది రాష్ర్టాల అంశమని, ఇందులో కేంద్రం జోక్యాన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్ర లైబ్రరీలు రాష్ర్టాల పరిధిలోనే ఉండాల్సిన అవసరం ఉన్నదని కర్ణాటక రాష్ట్ర లైబ్రరీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. లైబ్రరీలను ఉమ్మడి జాబితాలోకి చేర్చే విషయం తనకు సమాచారం లేదంటూనే.. లైబ్రరీలను కేంద్రం తన నియంత్రణలోకి తీసుకొంటే, దానికి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలయ్యే నిధులలో సమస్య ఏర్పడుతుందని అన్నారు.