బీజేపీపై తృణమూల్ నేత బాబుల్ సుప్రియో తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ అనుసరిస్తున్న ద్వేష విధానాల వల్లే తాను బీజేపీ నుంచి వైదొలగాల్సి వచ్చిందన్నారు. ఆ పార్టీ అనుసరిస్తున్న ద్వేష, విభజన రాజకీయాల వల్లే తాను బీజేపీని వీడానని ఆయన ప్రకటించారు. బెంగాల్ వారసత్వం, సంస్కృతి, సెక్యులర్ విధానాన్ని కాపాడుకోవడానికి చేయాల్సిందంతా చేస్తానని హామీ ఇచ్చారు. తాను ఎలాంటి ద్వేష రాజకీయాలకు పాల్పడలేదని, సంకుచిత రాజకీయాలు తాను ఎన్నటికీ చేయనన్న విషయం అసన్సోల్ ప్రజలకు బాగా తెలుసని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నేతలు తనను మోసం చేశారని, బెంగాల్ ప్రజల ఐక్యత, వైవిధ్యత కోసం తాను పనిచేస్తానన్నారు.
బెంగాల్లోని అసన్సోల్ లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ తృణమూల్ అభ్యర్థిని ప్రకటించారు. నటుడు నుంచి రాజకీయ నేతగా ఎదిగిన శత్రుఘ్న సిన్హాను తృణమూల్ అభ్యర్థిగా అసన్సోల్ నుంచి బరిలోకి దింపుతున్నామని సీఎం మమత ప్రకటించారు. ఇక… బాలిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి, సింగర్ బాబుల్ సుప్రియోను తృణమూల్ అభ్యర్థిగా బాలిగంజ్ నుంచి రంగంలోకి దింపుతున్నామని మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.