ముంబై: కొందరు రిటైర్డ్ జడ్జిలు ‘దేశ వ్యతిరేక ముఠా’గా ఏర్పడ్డారంటూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం మండిపడ్డారు.
కొందరు మాజీ న్యాయమూర్తులు, సామాజిక వేత్తలు, హక్కుల నేతలు యాంటీ ఇండియా గ్యాంగ్గా మారి భారత న్యాయవ్యవస్థను విపక్ష పార్టీల పాత్రలోకి మార్చడానికి ప్రయత్నిస్తున్నారంటూ మంత్రి రిజిజు పేర్కొనడం న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తేవడమే కాక న్యాయమూర్తులను బెదిరించడానికి చేసిన ప్రయత్నమేనని సంజయ్ రౌత్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ‘అసలిది ఎలాంటి ప్రజాస్వామ్యం?’ అని ఆయన ప్రశ్నించారు.