Law commission | న్యూఢిల్లీ, జూన్ 2: దేశ ద్రోహ చట్టాన్ని కొనసాగించవచ్చునంటూ రిటైర్డ్ జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలోని 22వ లా కమిషన్ కేంద్ర న్యాయశాఖకు తాజాగా నివేదిక సమర్పించింది. దేశద్రోహ చట్టాన్ని రద్దు చేసేందుకు వలసవాద కాలం నాటి చట్టమనేది సరైన కారణం కాబోదని పేర్కొన్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ విపక్షాలపై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నదనే విమర్శల నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకొన్నది. గతంలో దేశద్రోహ చట్టాన్ని కూడా బీజేపీ దుర్వినియోగం చేసిందని, ప్రభుత్వ వ్యతిరేక, అసమ్మతి గొంతుకలను అణచివేసేందుకు వివాదాస్పద దేశద్రోహ చట్టాన్ని ఒక ఆయుధంగా వినియోగించి భారీ సంఖ్యలో కేసులు నమోదు చేసిందనే విమర్శలు ఉన్నాయి.
గత ఏడాది మేలో సుప్రీంకోర్టు ఈ చట్టం అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ.. దేశద్రోహానికి సంబంధించిన ఐపీసీ సెక్షన్ ‘124ఏ’ను సమీక్ష చేయాలని ఆదేశించింది. దేశ అంతర్గత భద్రత ముప్పు నేపథ్యంలో సెక్షన్ 124ఏ అవసరమని, రద్దు చేస్తే దేశ భద్రత, సమగ్రతకు ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉన్నదని లా కమిషన్ తన తాజా నివేదికలో అభిప్రాయపడింది. అయితే సెక్షన్ 124ఏ వినియోగం, స్పష్టత కోసం కొన్ని సవరణలు అవసరమని పేర్కొన్నది. చట్టం దుర్వినియోగాన్ని అరికట్టేందుకు మార్గదర్శకాలు జారీచేయాలని కేంద్రానికి సూచించింది. దేశద్రోహం చట్టంపై లా కమిషన్ చేసిన సిఫారసులను కేంద్రం సుప్రీంకోర్టులో ప్రస్తావించే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దర్యాప్తు సంస్థలకు తోడుగా విపక్షాలపై వేధింపులకు ఈ ‘దేశద్రోహ’ ఆయుధాన్ని కొనసాగించేందుకు మోదీ సర్కార్ అడుగులు వేయనున్నదనే విశ్లేషణలు వస్తున్నాయి.
లా కమిషన్ మరో కీలక సిఫారసు చేసింది. దేశద్రోహ కేసుల్లో కనీస జైలు శిక్షను మూడు నుంచి ఏడేండ్లకు పెంచాలని పేర్కొన్నది. ఈ సిఫారసుపై ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. లా కమిషన్ సిఫారసులు దేశద్రోహం చట్టాన్ని మరింత కఠినంగా మార్చేలా ఉన్నాయని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి అన్నారు. ఇప్పటికే విపక్ష నేతలపై వేధింపు రాజకీయాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇది భయంకరమైన పరిణామం అని విమర్శించారు. దేశద్రోహ చట్టాన్ని మరింత క్రూరంగా, కఠినంగా మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ పావులు కదుపుతున్నదని ఆరోపించారు.
124ఏ సెక్షన్ లేకుంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించే ఘటనల్లో మరింత కఠినమైన ప్రత్యేక, ఉగ్రవాద వ్యతిరేక చట్టాలను ఉపయోగించాల్సి వస్తుందని కమిషన్ పేర్కొన్నది. కొన్ని దేశాలు ఇటువంటి సెక్షన్లను రద్దు చేశాయని చెప్పి.. మన దేశంలోని వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా దాన్ని గుడ్డిగా అనుసరించలేమని అభిప్రాయపడింది. సెక్షన్ 124ఏ రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ అవస్థి ఈ సందర్భంగా సిఫారసు నివేదికలో గుర్తుచేశారు. ‘భారత లీగల్ సిస్టమ్ అంతా వలసవాదంపైనే ఆధారపడింది. అలాంటి వలసవాదాన్ని బూచిగా చూపి, ఈ సెక్షన్ను రద్దు చేయాలని కోరలేం. దుర్వినియోగం కాకుండా 124ఏను కొనసాగించడమే ఉత్తమం’ అని లా కమిషన్ అభిప్రాయపడింది.
మరో వివాదాస్పద అంశమైన ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అంశాన్ని కూడా కదిలించే ఆలోచనలో లా కమిషన్ ఉన్నట్టు తెలుస్తున్నది. యూసీసీపై కూడా పనిచేయాలని లా కమిషన్ అనుకొంటున్నదని రిటైర్డ్ జడ్జి జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్లో యూసీసీ ముసాయిదా తయారీ కమిటీలో ఉన్న ఈయన.. శుక్రవారం లా కమిషన్ చైర్పర్సన్, సభ్యులతో సమావేశం అనంతరం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.