న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ప్రవాస భారతీయులు (ఎన్నారైలు), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ), భారత పౌరుల మధ్య వివాహాల్లో మోసాలు పెరుగుతుండటంపై లా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. వీటి కట్టడికి సమగ్ర చట్టం తేవాల్సిన అవసరమున్నదని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఎన్నారై, ఓసీఐ, భారత పౌరుల మధ్య వివాహాలను తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలని సూచించింది. ఈ మేరకు ఓ నివేదికను న్యాయ మంత్రిత్వ శాఖకు ప్యానెల్ చైర్మన్ జస్టిస్(రిటైర్డ్) రితు రాజ్ అవస్థీ అందచేశారు.
ఎన్నారై వివాహాల్లో జరుగుతున్న మోసాల్లో ముఖ్యంగా భారతీయ మహిళలే అత్యధికంగా బాధితులని నివేదిక పేర్కొన్నది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్కు కమిషన్ గురువారం రాసిన కవరింగ్ లెటర్లో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఇటువంటి చట్టాన్ని కేవలం ఎన్నారైలకే కాకుండా పౌరసత్వ చట్టం, 1955లో పేర్కొన్న ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ)లకు కూడా వర్తింప చేయాలని ప్యానెల్ సూచించింది.