Lashkar terrorist : దేశంలో భారీ ఉగ్రకుట్ర బయటపడింది. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు సహకరిస్తున్న షబ్బిర్ అహ్మద్ అనే ఉగ్రవాదిని ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి ఉగ్రదాడులకు సంబంధించి కీలక సమాచారాన్ని సేకరించారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని వాణిజ్య ప్రాంతాలు, హిందూ దేవాలయాలే టార్గెట్గా ఎంచుకున్నట్లు వెల్లడైంది.
విశ్వసనీయ సమచారం ప్రకారం.. బంగ్లాదేశ్ కేంద్రంగా పని చేసే ఉగ్రసంస్థలతో, అలాగే పాక్ ఉగ్రవాద సంస్థలతోనూ ఢిల్లీకి చెందిన షబ్బిర్ అహ్మద్ సంబంధాలు కలిగి ఉన్నాడు. దేశంలోని కీలక ప్రదేశాలకు సంబంధించిన సమాచారాన్ని అతడు లష్కరే తొయిబా వంటి సంస్థలకు చేరవేశాడు. ఢిల్లీలోని ప్రధాన కేంద్రాల్ని వారు లక్ష్యంగా ఎంచుకుని, అనేక ప్రాంతాలపై నిఘా ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని హిందూ ఆధ్యాత్మిక కేంద్రాలైన కల్కాజి టెంపుల్, చాతర్పూర్ టెంపుల్, లోటస్ టెంపుల్లతోపాటు ప్రధాన వాణిజ్య కేంద్రాలైన కొన్నాట్ ప్లేస్, పహర్గంజ్ వంటి కమర్షియల్ హబ్స్ను ఎంచుకున్నారు. షబ్బిర్ అహ్మద్ వాటిని మొత్తం పరిశీలించి, అక్కడి వివరాల్ని వీడియోలుగా చిత్రీకరించి, వాటిని పాక్ ఉగ్రసంస్థలకు చేరవేశాడు. షబ్బిర్ ఒంటరిగా తిరుగుతూ ఆ ప్రదేశాల వివరాల్ని సేకరించాడు. అతడు బంగ్లాదేశ్, పాక్ ఉగ్రవాద సంస్థలతోపాటు ఐఎస్ఐ వంటి పాక్ ఇంటెలిజెన్స్ సంస్థలతో కూడా కలిసి పని చేస్తున్నాడు.
బంగ్లాదేశ్లో ఒక కొత్త తీవ్రవాద సంస్థను స్థాపించాలనే లక్ష్యంలో భాగంగా షాబిద్, మిగతా ఉగ్రవాదులు కలిసి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ, ఎన్సీఆర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో సభ్యుల్ని చేర్చుకోవడం, ఉగ్రవాదంపై ప్రోత్సహించడం వంటి కార్యకలాపాలు లక్ష్యంగా వీరు పని చేస్తున్నారు. భారత నిఘా సంస్థల నుంచి తప్పించుకునేందుకు షబ్బిర్.. టెలిగ్రాం వంటి యాప్స్ వాడేవాడు. ఇటీవల ఇలాగే జమ్మూ కాశ్మీర్లో ఇలాగే టీఆర్ఎఫ్ (ద రెసిస్టెన్స్ ఫ్రంట్) అనే ఉగ్ర సంస్థ పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పోలీసులు సరైన సమయంలో షబ్బిర్ అనే ఉగ్రవాదిని గుర్తించడంతో భారీ కుట్ర భగ్నమైంది.