CM Siddaramaiah | బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణం ఉచ్చు మరింత బిగుసుకుంటున్నది. వందల కోట్ల రూపాయల కుంభకోణంలో ఆయన పాత్ర, ప్రమేయంపై ముఖ్యమైన ఆధారాలు లభ్యం కావడంతో ఆయనపై చర్యలు చేపట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధపడుతున్నది.
సీఎం అక్రమాలపై పిటిషనర్ స్నేహమయి కృష్ణ తమకు ఫిర్యాదు చేసిన అనంతరం ఈడీ అధికారులు సీఎం నగదు వ్యవహారాలు, హవాలా కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. అంతేకాకుండా తమకు లభ్యమైన ఆధారాలను ఉటంకిస్తూ ఈడీ అధికారులు.. కర్ణాటక లోకాయుక్తకు ఒక లేఖ కూడా రాశారు. ముడాకు సంబంధించి అనేక స్థలాలను సిద్ధరామయ్య కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులకు అక్రమంగా కట్టబెట్టినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. ఇప్పటికే ఆర్టీఐ కార్యకర్త గంగరాజు కూడా కీలక ఆధారాలను ఈడీకి సమర్పించారు.