(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో కర్ణాటక అస్తవ్యస్తంగా మారింది. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలిచే బెంగళూరులో రియల్ ఎస్టేట్ నీటి బుడగలా పేలిపోయింది. కాంగ్రెస్ సర్కారు అసమర్థ విధానాలు, ప్రభుత్వంలో పేరుకుపోయిన అవినీతి, పాలసీల అమలులో వేగంలేకపోవడంతోనే కొనుగోలుదారులు, పారిశ్రామికవేత్తలు ఇతర నగరాలకు వెళ్తున్నారని స్థిరాస్తిరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నగరంలోని ఇండిపెండెంట్, అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ తదితర నివాస గృహాలు, ఆఫీసు స్పేస్ లీజులు, కమర్షియల్ కాంప్లెక్స్లు, వాణిజ్య, అగ్రి అవసరాలకు సంబంధించిన అన్ని భూముల విక్రయాలు భారీగా పతనమైనట్టు బెంగళూరు రియల్టర్లు లబోదిబోమంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగానే ఈ దుస్థితి దాపురించినట్టు మండిపడుతున్నారు.
ఆఫీస్ స్పేస్ లీజులో పతనం
బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజింగ్ అంతకంతకూ పడిపోతున్నదని ప్రముఖ రియల్టీ కన్సల్టెంట్ వెస్టియన్ తాజా నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది మూడో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో బెంగళూరు ఆఫీస్ స్పేస్ లీజులు 36 లక్షల చదరపు అడుగులకే పరిమితమయ్యాయని, నిరుడు జూలై-సెప్టెంబర్ (క్యూ3)లో నమోదైన గ్రాస్ లీజింగ్ 50 లక్షల చదరపు అడుగులతో పోలిస్తే, ఈసారి లీజింగ్ 28 శాతం తగ్గుముఖం పట్టిందని వెల్లడించింది. ఇదే సమయంలో హైదరాబాద్లో లీజులు ఏకంగా 270 శాతం పెరిగినట్టు వివరించింది.
ఇక, ఎత్తైన భవనాల నిర్మాణం కూడా బెంగళూరులో అంతకంతకూ పడిపోతున్నదని.. ఈ జాబితాలో 8 శాతం వాటాతో హైదరాబాద్ టాప్లో ఉండగా, కేవలం ఒక్కశాతం వాటాతో బెంగళూరు అట్టడుగున ఉన్నట్టు ప్రముఖ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ సంస్థ కోల్డ్వెల్ బ్యాంకర్ రిచర్డ్ ఎల్లిస్ (సీబీఆర్ఈ) ఏషియన్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించిన సర్వేలో తేలింది. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నివాస గృహాల ధరలు 33 శాతం మేర పెరగ్గా, బెంగళూరులో కార్పొరేట్ ఆఫీసులకు అడ్డాగా పిలిచే వైట్ఫీల్డ్లో 29 శాతం కూడా వృద్ధి కనిపించలేదని అనరాక్ సంస్థ తాజా నివేదికలో తెలిపింది. లగ్జరీ ఇండ్ల నిర్మాణం, అమ్మకాల్లో 14,340 యూనిట్లతో హైదరాబాద్ టాప్ ప్లేస్లో ఉంటే, 1,710 యూనిట్లతో బెంగళూరు అంతకంతకూ దిగజారుతున్నట్టు అనరాక్ గ్రూప్ మరో నివేదికలో వివరించింది.
తగ్గిన ఇండ్ల అమ్మకాలు
జూన్-జూలైనాటికి బెంగళూరులో ఇండ్ల అమ్మకాలు 19 శాతం మేర పడిపోయినట్టు ప్రాప్టైగర్ మరో నివేదికలో తెలిపింది. జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో ఆఫీస్ స్థలానికి బెంగళూరులో డిమాండ్ 39 శాతం మేర పడిపోయినట్టు కుష్మన్ అండ్ వెక్ఫీల్డ్ నివేదికలో వెల్లడించింది. గడిచిన ఆరు నెలల వ్యవధిలో బెంగళూరులోని రెసిడెన్షియల్ ల్యాండ్స్, బిల్డింగ్స్, ఆఫీసు స్పేస్ లీజులు, కమర్షియల్ కాంప్లెక్స్లు, వాణిజ్య, అగ్రిఅవసరాలకు సంబంధించిన అన్ని భూముల ధరలు మునపటితో పోలిస్తే, భారీగా పతనమైనట్టు నైట్ఫ్రాంక్, నరెడ్కో, క్రెడాయ్, క్రిసిల్, సీబీఆర్ఈ, కొల్లీర్స్ ఇండియా, ఎన్హెచ్బీ తదితర సంస్థల నివేదికల్లో వెల్లడైంది.
ఇప్పుడు తెలంగాణపై గురి
బీఆర్ఎస్ పాలనలో యావత్తు తెలంగాణలో భూముల ధరలు బంగారమయ్యాయి. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన సులభతర పారిశ్రామిక విధానంతో దేశ విదేశాల్లోని ప్రఖ్యాత కంపెనీలు హైదరాబాద్కు క్యూ కట్టాయి. దీంతో నగరంలో భూముల ధరలు వందలరెట్లు పెరిగిపోయాయి. దక్షిణాసియాలోనే ఖరీదైన ప్రాంతాల జాబితాలో గచ్చిబౌలి, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పేర్లు ఉన్నాయంటే అతిశయోక్తికాదు. అందుకే, ఇప్పుడు కాంగ్రెస్ నేతల కండ్లు భాగ్యనగరం భూముల మీద పడ్డాయి. ఆరు నెలల్లోనే బెంగళూరు రియల్ఎస్టేట్ను అస్తవ్యస్తం చేసిన హస్తంపార్టీ నాయకులు తమ మాయమాటలతో ఇక్కడి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని అనుకొంటున్నారు. ఆదమరిచి ఓటేస్తే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా బెంగళూరు మాదిరిగా కుదేలవ్వడం ఖాయమని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు.
కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ ఢాం
కాంగ్రెస్లో ఆరు నెలలకు ఓ సీఎం మారుతాడు. ఇలాంటి సమయంలో పాలసీల అమలుకు తావెక్కడుంటుంది? చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా.. ఢిల్లీ మీదే ఆధారపడే అసమర్థులున్న ఆ పార్టీ.. స్థిరమైన నిర్ణయాలను వేగంగా ఎలా అమలుచేయగలదు. అందుకే, బెంగళూరులో రియల్ ఎస్టేట్ ఢాం అన్నది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత బెంగళూరు ఆఫీస్ స్పేస్ లీజింగ్ 28 శాతం మేర పడిపోయిందని వెస్టియన్ నివేదిక చెప్పింది. ఇదే సమయంలో హైదరాబాద్ శరవేగంగా వృద్ధి చెందుతున్నది.
– ఐటీ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్