బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ తాజాగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 2004-09 సమయలో రైల్వే శాఖలో గ్రూప్ డి ఉద్యోగాలు ఇప్పిచ్చినందుకు ప్రతిఫలంగా అభ్యర్థుల నుంచి తక్కువ ధరకే ఫ్లాట్లను సొంతం చేసుకున్నారన్నది లాలూ కుటుంబీకులపై వచ్చిన అభియోగం.
ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు లాలూ భార్య, మాజీ సీఎం రబ్రీ దేవిని కూడా ఈ కేసులో విచారించారు. అంతేకాకుండా లాలూ యాదవ్ నివాసాలతో పాటు మరో 15 మంది నివాసాలపై సీబీఐ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ దాడులను నిరసిస్తూ ఆర్జేడీ కార్యకర్తలు నిరసనలు చేశారు.
ఇలా నిరసనలు వ్యక్తం చేస్తున్న సమయంలో మాజీ సీఎం రబ్రీదేవి పార్టీ కార్యకర్తలతో అనుచితంగా ప్రవర్తించారు. వారిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నిరసన వ్యక్తం చేస్తున్న కార్యకర్తలపై చేయికూడా చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాలూ కుటుంబంపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపులకు దిగుతోందని, అందులో భాగంగానే ఈ కేసులంటూ కార్యకర్తలు ఆరోపించారు.
ఇక.. మరోవైపు దాడుల సందర్భంగా సీబీఐ అధికారులు వస్తున్న నేపథ్యంలో ఆర్జేడీ కార్యకర్తలు, లాలూ మద్దతుదారులు రోడ్లన్నీ బ్లాక్ చేసేశారు. బీజేపీకి వ్యతిరేకంగా, సీబీఐకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది.