పట్నా : యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్కు ముందు అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని సమాజ్వాదీ (ఎస్పీ) పార్టీకి ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ బుధవారం మద్దతు తెలిపారు. బీజేపీ తీరును చూస్తుంటే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీకి భంగపాటు తప్పేలా లేదని అన్నారు. ఎన్నికలకు ముందు బీజేపీ అల్లర్లు, ఆలయాల వంటి సున్నితమైన అంశాలను తెరపైకి తెస్తోందని దుయ్యబట్టారు. యూపీ ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలియడంతోనే బీజేపీలో నైరాశ్యం నెలకొందని ఆర్జేడీ చీఫ్ వ్యాఖ్యానించారు. దేశాన్ని పీడిస్తున్న పేదరికం, ధరల పెరుగుదల వంటి అంశాలపై మౌనం దాల్చిన బీజేపీ అయోధ్య, వారణాసి గురించి మాట్లాడుతోందని దుయ్యబట్టారు.
కర్నాటకలో హిజాబ్ వివాదాన్ని బీజేపీ లేవనెత్తుతోందని విమర్శించారు. 75 ఏండ్ల కిందట మన నేతలు బ్రిటిష్ వారిని తరిమికొడితే ఇప్పుడు బీజేపీ రూపంలో బ్రిటిష్ పాలకులు తిరిగి వచ్చారని లాలూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో అంతర్యుధ్ధానికి దారితీసే పరిస్ధితులు కనిపిస్తున్నాయని అన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఎస్పీకి మద్దతు ఇస్తామని లాలూ స్పష్టం చేశారు. ఇక ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలుపొంది అధికారం నిలుపుకోవాలని పాలక బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుండగా, యోగి సర్కార్పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని ఎస్పీ చెమటోడుస్తోంది. ఇక ప్రియాంక గాంధీ ఇమేజ్తో సత్తా చాటాలని కాంగ్రెస్ యోచిస్తుండగా, దళితులు, అణగారిన వర్గాల వెన్నుదన్నుతో ప్రధాన పార్టీలకు దీటైన పోటీ ఇవ్వాలని మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పావులు కదుపుతోంది.