యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఆలయం చుట్టూ నిర్మితమవుతున్న కట్టడాలు భక్తులకు ఆకట్టుకోవడంతో పాటు సౌకర్యవంతంగా ఉన్నాయి. భక్తులు పవిత్ర స్నానమాచరించేందుకు యాదాద్రి కొండ కింద గండిచెరువు వద్ద నిర్మితమవుతున్న అధునాతన లక్ష్మీ పుష్కరిణీ పనులు చివరి దశకు చేరుకున్నాయి. పుష్కరిణికి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వైటీడీఏ అధికారులు మెరుగులు దిద్దుతున్నారు. గుండంలోకి వెళ్లే దారిలో స్వాగత తోరణం అద్బుతంగా తీర్చిదిద్దగా, ఇరుపక్కలా మండపాలను నిర్మించి ఆంజనేయుడి, గరుడ విగ్రహా లను ప్రతిష్టించారు. ఆ పక్కనే నిర్మించిన భక్తుల విశ్రాంతి భవనాల గోడలకు ఐరావతాలను అద్భుతంగా నిర్మించారు.
గుండంలో 2 మండపాలను నిర్మించారు. గుండం చుట్టూ భక్తులు వెళ్లేందుకు అనుగుణంగా స్టీల్ గ్రిల్స్ను ఏర్పాటు చేశారు. రెండు మండపాలను విభజిస్తూ స్టీల్ గ్రిల్స్, భక్తులు స్నానానికి వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు ప్రత్యేకంగా గ్రిల్స్ను బిగించారు. స్నానమాచరించిన అనంతరం బట్టలు మార్చుకునేందుకు మహిళలు, పురుషులకు ప్రత్యేకమైన డ్రెస్సింగ్ రూంలు, టాయిలెట్లను నిర్మిస్తున్నారు. ఏకకాలంలో సుమారు 1500 మంది భక్తులు స్నానమాచరించే విధంగా రూ. 11.55 కోట్లతో 2.47 ఎకరాలలో పుష్కరిణిని నిర్మిస్తున్నారు.
భవనాన్ని 59 మీటర్ల వెడల్పు, 66 మీటర్ల పొడవుతో నిర్మించారు. 43 మీటర్ల పొడవు, 16.50 మీటర్ల వెడల్పు, 4 ఫీట్ల ఎత్తులో గుండం నిర్మిస్తున్నారు. ఇందులో 15 లక్షల నీటిని నిల్వ సామర్ధ్యంతో గుండం నిర్మాణాలు జరుగుతుండగా పనులు తుది దశకు చేరుకున్నాయి. కాళేశ్వరం 16 ప్యాకేజీలో భాగంగా బస్వాపూర్లో నిర్మిస్తున్న నృసింహస్వామి జలాశయం నుంచి గండిచెరువుకు గోదావరి జలాలను తీసుకురానున్నారు. అక్కడి నుంచి నేరుగా లక్ష్మీపుష్కరిణికి గోదావరి జలాలు విడుదల చేసేందుకు కావాల్సిన పనులు జరుగుతున్నాయి.