కావరట్టి: లోక్సభ తొలి దశ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం లక్షద్వీప్(Lakshadweep)లో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. సుమారు 83.88 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు తెలుస్తోంది. లక్షద్వీప్లో ఎన్సీపీ తరపున మహమ్మద్ ఫైజల్, కాంగ్రెస్ తరపున హమదుల్లా సయ్యిద్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. లక్షద్వీప్లో 57,784 ఓట్లు ఉండగా, దాంట్లో 48,468 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. దీంట్లో 24,190 మంది పురుషులు, 24,278 మంది మహిళలు ఉన్నారు. ఆ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న పది దీవుల్లోని 55 బూతుల్లో ఎన్నికలు జరిగాయి. దాదాపు అన్ని దీవుల్లో 85 శాతం పోలింగ్ జరిగింది. మినికాయ్ దీవిలో మాత్రం అత్యల్పంగా 63.78 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. 2019 లోక్సభ ఎన్నికల్లో లక్షద్వీప్లో రికార్డు స్థాయిలో 85.14 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది.