Lakshadweep | గూగుల్ సెర్చ్లో లక్షద్వీప్ కీవర్డ్ 20 సంవత్సరాల నాటి రికార్డును బద్దలు కొట్టింది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా లక్షద్వీప్ గురించి గూగుల్లో తెగ శోధిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గతవారంలో ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్లో పర్యటించారు. తన పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లక్షద్వీప్లో టూరిజం అభివృద్ధి చేసేందుకు ద్వీపాన్ని సందర్శించాలని ఆయన భారతీయులకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత ప్రధాని లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవులకు చెందిన మంత్రులు నోరుపారేసుకున్నారు.
ప్రధాని మోదీ, భారత్పై అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు సోషల్ మీడియాలో బాయ్కాట్ మాల్దీవులు హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే భారతీయులతో పాటు విదేశీయులు సైతం లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు జనాభా, సంస్కృతి, రెస్టారెంట్లు, హోటల్స్ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. లక్షద్వీప్కు సంబంధించి గూగుల్లో ప్రతిరోజూ లక్ష కంటే ఎక్కువగా కీ వర్డ్ సెర్చింగ్ జరుగుతున్నది. మరో మాల్దీవుల నేతల ట్వీట్ల నేపథ్యంలో చాలా మంది మాల్దీవులు ట్రిప్ను రద్దు చేసుకుంటున్నారు.