లక్నో: ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీలో రైతులను వాహనంతో తొక్కించిన కేసులో కీలక నిందితుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు డెంగ్యూ సోకింది. దీంతో ఆయనను జిల్లా జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అడ్మిట్ చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. డెంగ్యూ నిర్ధారణ కోసం ఆశిష్ మిశ్రా రక్త నమూనాలను పరీక్ష కోసం ల్యాబ్కు పంపినట్లు చెప్పారు.
ఈ నెల 3న లఖింపూర్ ఖేరీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ రైతులు రోడ్డు పక్కగా నిరసన తెలిపారు. ఆయన కుమారుడు ఆశిష్ మిశ్రా కాన్వాయ్లోని వాహనం రైతులపైకి దూసుకెళ్లి వారిని తొక్కేసింది. ఈ ఘటనతోపాటు అనంతరం జరిగిన ఆందోళనలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్, ముగ్గురు బీజేపీ కార్యకర్తలు చనిపోయారు.
దేశ వ్యాప్తంగా కలకలం రేపిన ఈ కేసులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నది. సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతున్నది. ఈ కేసులో నిర్లక్ష్యంపై యూపీ పోలీసులకు చీవాట్లు పెట్టింది. దీంతో పోలీసులు ఇప్పటి వరకు కీలక నిందితుడు ఆశిష్ మిశ్రాతోసహా 13 మందిని అరెస్ట్ చేశారు.