న్యూఢిల్లీ: ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నదని కార్మిక, పౌర సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గ్రామాల్లో పేదలకు ఆర్థికంగా అండగా ఉంటున్న ఈ పథకాన్ని కాపాడుకొనేందుకు సహకరించాలని ప్రతిపక్ష పార్టీలను కోరాయి. ఈ మేరకు ఢిల్లీలో మంగళవారం జరిగిన సమావేశంలో పలు కార్మిక, పౌర సంఘాల నేతలు ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నీరుగార్చుతున్న తీరును విపక్ష పార్టీల ఎంపీలకు వివరించాయి. ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ నిధులు పెంచడం తదితర డిమాండ్లకు మద్దతు పలికాలని, కోట్లాది కార్మికుల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించాలని కోరారు. 2021 డిసెంబర్ నుంచి ఉపాధి హామీ కార్మికులకు వేతనాల చెల్లింపు జరగడం లేదని పేర్కొన్నారు.
చరిత్రలోనే అత్యల్ప కేటాయింపులు
ప్రజెంటేషన్ను రాంచీ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్ జీన్ డ్రెజే ప్రారంభించారు. ఉపాధి హామీ పథకంపై కేంద్రం త్రిముఖ దాడి ప్రారంభించిందని అన్నారు. సరిపడా నిధులు కేటాయించకపోవడం, ఆధార్ ఆధారిత వేతనాల చెల్లింపు, యాప్లో హాజరు నమోదు వంటి చర్యల ద్వారా పథకం ఉద్దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. ఈ పథకానికి ఈ ఏడాది కేవలం రూ.60 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, ఇది స్కీమ్ చరిత్రలోనే అత్యల్పమని పేర్కొన్నారు. ‘నిధులు అయిపోయాయి. పనులు ఆగిపోతున్నాయి. కొన్ని నెలలుగా వేతనాల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి’ అని అన్నారు.
ఉపాధి హామీకి నిధుల కోతనా?
పార్లమెంటరీ స్థాయి సంఘం ఆందోళన
న్యూఢిల్లీ: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడంపై పార్లమెంటరీ స్థాయి సంఘం సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధిపై ఏర్పాటు చేసిన కమిటీ బుధవారం రాజ్యసభకు నివేదిక సమర్పించింది. ఉపాధి హామీ పథకానికి 2022-23 సవరించిన అంచనాలతో పోల్చితే 2023-24 బడ్జెట్ అంచనాలను రూ.29,400 కోట్లు తగ్గించారని కమిటీ తెలిపింది. 2019-20, 2020-21, 2021-22లలో కేటాయించిన బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయకుండా మురగ బెడుతున్నారని ఆక్షేపించింది. ఎలాంటి ఆదాయ వనరులు లేని గ్రామీణ అణగారిన వర్గాల ప్రజలకు ఈ పథకం ద్వారా ఉపాధి లభిస్తున్నదన్న విషయాన్ని కేంద్రానికి గుర్తు చేసింది.