న్యూఢిల్లీ, మార్చి 22: ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని ఉపాధి కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో కేంద్రం తీసుకొచ్చిన ఆన్లైన్ హాజరు, ఆధార్ ఆధారిత చెల్లింపు విధానాన్ని వ్యతిరేకిస్తూ, వాటిని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద వారు దాదాపు నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నిరసనలో వివిధ రాష్ర్టాలకు చెందిన వందలాది మంది ఉపాధి కూలీలు పాల్గొంటున్నారు. అయితే తమ గోడును కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్లు నెరవేర్చే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టంచేశారు.
ఉపాధి హామీ పథకంలో నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్(ఎన్ఎంఎంఎస్) ద్వారా, డిజిటల్ హాజరును కేంద్రం ఇటీవల తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఈ విధానంపై కార్మికుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఆన్లైన్ హాజరు కింద పని ప్రదేశానికి సంబంధించి కూలీల జియోట్యాగ్, టైమ్తో కూడిన ఫొటోలను యాప్లో ఉదయం 11 గంటల లోపే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. యాప్ సకాలంలో ఓపెన్ కాక, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ సరిగా లేని కారణంగా ఫొటో అప్లోడ్ కాకుంటే పనికి గైర్హాజరు అయినట్టు చూపుతుంది. ఈ యాప్ విధానం వల్ల ఎంత కష్టపడినా సాంకేతిక సమస్యలతో హాజరు నమోదు కాకుంటే రూపాయి కూడా రాదని బీహార్లోని ముజఫర్నగర్కు చెందిన ఖుస్బు దేవీ అనే ఉపాధి హామీ కార్మికురాలు ఆందోళన వ్యక్తం చేశారు.
పారదర్శకత పేరుతో తీసుకొచ్చిన ఆధార్ ఆధారిత చెల్లింపు విధానాన్ని కూడా కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విధానంలో కూలీకి కచ్చితంగా ఆధార్ ఉండి, అది బ్యాంకు ఖాతాకు లింక్ అయి ఉండాలి. ఈ విధానం ఉపాధి హామీ కూలీల పట్ల వినాశకరమైదని ఆర్థికవేత్త, రాంచీ యూనివర్సిటీ విజిటింగ్ ప్రొఫెసర్ జీన్ డ్రెజే విమర్శించారు. బ్యాంకు ఖాతాను ఆధార్తో లింక్ చేసుకోవడం, కఠినమైన కేవైసీ నిబంధనలు పాటించడం వంటి క్లిష్టమైన చట్రంలో కార్మికులు చిక్కుకుపోయారని అన్నారు. ఒకవేళ ఆధార్కార్డులోని పేరు, చిరునామాలో ఏమైనా అక్షర దోషాలు ఉంటే అది కార్మికుల కష్టాలను మరింత పెంచుతుందని పేర్కొన్నారు. అధికారిక డాటా ప్రకారం దేశంలోని ఉపాధి హామీ కార్మికుల్లో ఆధార్ ఆధారిత చెల్లింపునకు 43 శాతం మంది మాత్రమే అర్హులుగా ఉన్నారు.