కచ్, నవంబర్ 27: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి సారి ఒక ప్రాంతంపై రాజకీయ విశ్లేషకులు ప్రత్యేకంగా దృష్టిసారిస్తారు. రాష్ట్రమంతా ఒక రకమైన ఎన్నికల కోలాహలం ఉంటే.. ఆ ఒక్క ప్రాంతంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అదే.. కచ్. గుజరాత్లో అత్యంత శుష్క ప్రాంతమైన కచ్ జిల్లా పాకిస్థాన్ సరిహద్దుకు ఆనుకొని ఉంటుంది. ఇక్కడ మత కలహాలు సర్వ సాధారణం. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతం మాదకద్రవ్యాలకు అడ్డాగా మారింది. గుజరాత్లోన అతి పెద్ద నౌకాశ్రయాలు కచ్ తీరంలోనే ఉన్నాయి. దీంతో విదేశాల నుంచి టన్నుల కొద్దీ డ్రగ్స్ ఇక్కడికి రహస్యంగా తరలి వస్తున్నాయి. ఒక్క 2021లోనే ఈ ప్రాంతంలో పోలీసులు రూ.21,000 కోట్ల విలువైన 3 వేల కిలోల హెరాయిన్ను పట్టుకొన్నారు. సహజంగానే ఈ రెండు అంశాలు ఇప్పుడు ఎన్నికల ప్రచారాస్ర్తాలుగా మారాయి. కచ్లో మళ్లీ తమను గెలిపించి దేశ భద్రతను భద్రమైన వ్యక్తుల చేతుల్లో పెట్టాలని అధికార బీజేపీ ప్రచారం చేస్తున్నది. బీజేపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే కచ్ ప్రాంతం మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు కేంద్రంగా మారిందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తున్నది.