బెంగళూరు, డిసెంబరు 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్పై జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జేడీఎస్ పార్టీ, మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో పాటు ఇటీవల తాను ప్రారంభించిన పంచరత్న యాత్రను అవహేళన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో నిందితుడిగా ఉన్న బీఎల్ సంతోష్.. మూడేండ్ల కిందట జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చారని అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో విచారణకు హాజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్నారని పేర్కొన్నారు. మాఫియా, సంఘ విద్రోహ శక్తుల నుంచి వసూలు చేసి.. ఆ సొమ్ముతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడంలో సంతోష్ సిద్ధహస్తుడని ధ్వజమెత్తారు. ‘40% కమీషన్’ సర్కార్గా పేరుగాంచిన బీజేపీకి.. తమ కుటుంబం గురించి, జేడీఎస్ పార్టీ గురించి మాట్లాడే నైతికత లేదన్నారు. ‘పంచరత్న యాత్ర గురించి మాట్లాడుతారా? జోలె పట్టుకు తిరుగుతున్నానని అవహేళన చేస్తారా?’ అని దుయ్యబట్టా రు. ‘మీకు కర్ణాటకకు ఏంటి సంబంధం? రాష్ర్టానికి మీరు చేసిన ఒక్కమంచి పని అయి నా ఉన్నదా?’ అని సూటిగా ప్రశ్నించారు. లంచాలు, దోపిడీలు చేసే బీజేపీ నేతలు.. సమాజాన్ని రెండుగా చీల్చి, మతసామరస్యాన్ని దెబ్బతీసే విద్వేషపు విష విత్తనాలు నాటుతున్నారంటూ కుమారస్వామి ధ్వజమెత్తారు.