హైదరాబాద్ : ఎన్డీఆర్ఎఫ్కు.. ఎస్డీఆర్ఎఫ్కు తేడా తెలియని వ్యక్తి కేంద్రమంత్రిగా ఉండటం దురదృష్టకరమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక నిధులపై కిషన్రెడ్డికి అవగాహన లేదని, కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ ద్వారా ఇచ్చిన ప్రత్యేక, అదనపు నిధులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 280 ప్రకారం రాష్ట్రానికి రాజ్యంగబద్దంగా హక్కుగా దక్కే ఎస్డీఆర్ఎఫ్ గణాంకాల పేరుతో కిషన్రెడ్డి ప్రజలను గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎలాంటి విపత్తు లేకుండా ఎస్డీఆర్ఎఫ్ నిధులు నిధులు వస్తాయి.
వీటిని తాము ప్రత్యేకంగా ఇచ్చినట్లు కిషన్రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని, తెలంగాణ రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన ఎస్డీఆర్ఎఫ్కు వచ్చే నిధులు తప్ప కేంద్రం నుంచి తెలంగాణకు దక్కిందేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. 2018 నుంచి తెలంగాణకు ఒక్క రూపాయి అదనంగా ఇవ్వలేదని లోక్సభలో కేంద్ర హోంశాఖ (మినిస్టర్ ఫర్ స్టేట్) నిత్యానంద్ రాయ్ చేసిన ప్రకటనను ఒకసారి చదవాలని కిషన్ రెడ్డికి హితవు పలికారు. ఎవరు తెలంగాణను మోసం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 2018 నుంచి ఇప్పటి దాకా బీజేపీ అధికారంలో ఉన్న బీహార్కు రూ.3,250 కోట్లు, మధ్యప్రదేశ్కు రూ.4,530 కోట్లు, కర్నాటకకు రూ.6,490 కోట్లు, గుజరాత్కు రూ.1,000 కోట్లు ఎన్డీఆర్ఎఫ్ అదనపు నిధులు అందించిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
తాము అధికారంలో ఉన్న నాలుగు రాష్ట్రాలకు రూ.15,270 కోట్లు ఇచ్చిన కేంద్రానికి తెలంగాణకు నిధులు ఇచ్చేందుకు ఎందుకు చేతులు రావడం లేదని నిలదీశారు. గుజరాత్లో వరదలు వచ్చినప్పుడు స్వయంగా ప్రధానమంత్రి ఆగమేఘాల మీద సర్వే నిర్వహించి.. 2021లో రూ.1000 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక అదనపు సహాయాన్ని అడ్వాన్స్ రూపంలో విడుదల చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కష్టాలు కనిపించని ప్రధాని మోడీ వివక్షపూరిత వైఖరిని ఎండగట్టడాన్ని కొనసాగిస్తామన్నారు. ఆయా రాష్ట్రాల మాదిరే తెలంగాణ రాష్ట్రానికి ఎన్డీఆర్ఎఫ్ ద్వారా అందించిన అదనపు నిధులు ఎన్నో దమ్ముంటే కిషన్రెడ్డి ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చైర్మన్గా ఉన్న హైలెవెల్ కమిటీ ఇచ్చే ఎన్డీఆర్ఎఫ్ అదనపు నిధులు అడిగే ధైర్యం లేక కిషన్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. 2018 నుంచి ఇప్పటిదాకా ఒక్కపైసా అదనంగా తెలంగాణకు అందించని తమ కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత వైఖరి నిజమని ఒప్పుకోవాలన్నారు. కేంద్రమంత్రిగా ఉంటూ సొంత రాష్ట్రానికి నయా పైసా సాయం తీసుకురాని చేతకాని మంత్రిగా కిషన్రెడ్డి చరిత్రలో మిగిలిపోతారన్నారు. అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కిషన్రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.