న్యూఢిల్లీ : కంటినిండా కునుకు తీసినందుకు కోల్కతా యువతి రూ 5 లక్షలు సొంతం చేసుకుంది. కోల్కతాకు చెందిన త్రిపర్ణ చక్రవర్తి (26) తన డ్రీమ్ జాబ్లో భాగంగా ఆగస్ట్ 24న తన స్లీపింగ్ స్కిల్స్తో రూ 5 లక్షలను దక్కించుకుంది. త్రిపర్ణ చక్రవర్తి వేక్ఫిట్.కోలో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు అప్లై చేసింది. టైటిల్ను గెలుచుకునేందుకు ఆమె వరుసగా వంద రోజులు రోజుకు నిరాటంకంగా 9 గంటల పాటు నిద్రించింది.
ఫైనల్లో నలుగురిని పక్కకు నెట్టి ఆమె టైటిల్ను దక్కించుకుంది. నాన్ స్టాప్ స్లీపింగ్లో తనకు టైటిల్ లభించడం పట్ల త్రిపర్ణ సంతోషం వ్యక్తం చేసింది. ఈ అవార్డు సరైన వ్యక్తికి, సరైన సమయంలో, సరైన ప్రదేశంలో దక్కిందిగా తాను భావిస్తానని చెప్పుకొచ్చింది.
జీవితంలో కష్టపడే ప్రతి ఒక్కరికీ సరైన నిద్ర చాలా అవసరమని దేశంలో ఫస్ట్ స్లీప్ ఛాంపియన్ కిరీటం దక్కించుకున్న త్రిపుర్ణ తెలిపింది. మనసు ప్రశాంతంగా ఉండేందుకు, విజయాలు సొంతం చేసుకునేందుకు మనిషి జీవితంలో రోజుకు 8 గంటల నిద్ర తప్పనిసరి అని అందరూ గుర్తెరగాలని అంది. శ్రమించే తత్వంతో పాటు తగినంత నిద్ర మన సామర్ధ్యాన్ని మెరుగుపరుస్తుందని పేర్కొంది.