India Budget | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం నాలుక చాచి కూర్చున్న వేళ భారతదేశం తీసుకొచ్చే బడ్జెట్పై దాదాపు అన్ని దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశ బడ్జెట్కు సంబంధించి.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు వచ్చిన మార్పులేంటి..? మొదటిసారి బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు..? బడ్జెట్ ఎక్కడ ముద్రించారు..? బడ్జెట్ సమర్పణకు ఎంత సమయం పట్టింది..? రైల్వే బడ్జెట్ను కేంద్ర బడ్జెట్లో ఎప్పుడు విలీనం చేశారు..? వంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మన దేశానికి 1947 ఆగస్టు 15 న స్వాతంత్య్రం వచ్చింది. ఇదే సమయంలో విభజన సమస్యలు ఉత్పన్నమై రెండు వర్గాల ప్రజల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల మధ్యనే 1947 నవంబర్ 26న మన తొలి బడ్జెట్ను మొదటి ఆర్థిక మంత్రి డాక్టర్ ఆర్ కే షణ్ముగం చెట్టియార్ ప్రవేశపెట్టారు. 1947 నవంబర్ 26 నుంచి 1948 మార్చి 31 వరకు.. కేవలం ఏడున్నర నెలల కాలానికే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం విశేషం. తొలి బడ్జెట్ మొత్తం అంచనా రూ.171.15 కోట్లు .. అంచనా ద్రవ్య లోటు రూ.24.59 కోట్లు.
స్వాతంత్య్రానికి ముందు..
భారతదేశం పరిపాలన ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటీష్ రాజరికానికి 1858 ఏప్రిల్ 7న బదిలీ అయింది. ఇది జరిగిన రెండేండ్ల తర్వాత అంటే 1860 ఏప్రిల్ 7న మొదటిసారి మన దేశ బడ్జెట్ను సమర్పించారు. బడ్జెట్ను సమర్పించిన మొదటి ఆర్థిక మంత్రి జేమ్స్ విల్సన్. అనంతరం తాత్కాలిక ప్రభుత్వ సభ్యుడు లియాఖత్ అలీ ఖాన్ 1947-48 బడ్జెట్ను సమర్పించారు. అయితే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశ మొదటి ఆర్థిక మంత్రి షణ్ముఖం చెట్టి 1947 నవంబర్ 26న స్వతంత్ర భారతదేశం తొలి బడ్జెట్ను సమర్పించారు.
ముందే చెప్పిన జర్నలిస్ట్..
బడ్జెట్లో భారతదేశం ప్రతిపాదించిన కొన్ని పన్ను మార్పుల గురించి బ్రిటన్ ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్చెకర్ హ్యూ డాల్టన్ ఒక జర్నలిస్ట్తో క్యాజువల్గా మాట్లాడుతూ చెప్పారు. భారత పార్లమెంటులో చెట్టి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే ఆ సమాచారాన్ని సదరు జర్నలిస్ట్ ప్రచురించాడు. ఆ కారణంగా హ్యూ డాల్టన్ తన పదవికి బలవంతంగా రాజీనామా సమర్పించాల్సి వచ్చింది. దాంతో అప్పటి నుంచి బడ్జెట్ ప్రింటింగ్ విషయంలో గోప్యత అనేది బడ్జెట్ సన్నాహకాల్లో ఒక ముఖ్య లక్షణంగా మారింది.
బడ్జెట్ లీక్.. ప్రింటింగ్ ప్లేస్ చేంజ్..
1950 వరకు బడ్జెట్ ప్రతులను రాష్ట్రపతి భవన్లో ముద్రించేవారు. అదే ఏడాది బడ్జెట్ లీక్ కావడంతో ప్రింటింగ్ చేసే స్థలాన్ని అధికారులు మార్చేశారు. అనంతరం న్యూఢిల్లీలోని మింటో రోడ్లో బడ్జెట్ ముద్రణ ప్రక్రియ ప్రారంభమైంది.
నార్త్ బ్లాక్లో ముద్రణ..
కేంద్ర ప్రభుత్వం 1980 లో నార్త్ బ్లాక్లో ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అప్పటి నుంచి ఇక్కడే బడ్జెట్ ప్రతులను ముద్రిస్తున్నారు. బడ్జెట్ ముద్రణకు ముందు హల్వా వేడుకను నిర్వహిస్తారు. ఈ వేడుక తర్వాతే బడ్జెట్ ముద్రణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
1955 వరకు ఇంగ్లిష్లోనే..
కేంద్ర బడ్జెట్ 1955 వరకు కేవలం ఆంగ్లంలోనే సమర్పించారు. దీని తర్వాత బడ్జెట్ పేపర్లను హిందీ, ఇంగ్లిషు.. రెండు భాషల్లోనూ ముద్రించడం ప్రారంభించారు.
రైల్వే బడ్జెట్ విలీనం..
బ్రిటీష్ పాలకులు 1924 లో యూనియన్ బడ్జెట్ కాకుండా రైల్వే బడ్జెట్ను ప్రత్యేకంగా తీసుకొచ్చారు. అప్పటి నుంచి 2016 వరకు రైల్వే బడ్జెట్, కేంద్ర బడ్జెట్లను వేర్వేరుగా సమర్పిస్తూ వచ్చారు. 2017లో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ.. రైల్వే బడ్జెట్ను కేంద్ర బడ్జెట్లో విలీనం చేయడంపై చర్చించారు. దీనిని పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేసి.. వారి సూచనల మేరకు 2017 లోనే అరుణ్ జైట్లీ తొలి సంయుక్త బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
సమయం, తేదీల్లో మార్పులు..
కేంద్ర బడ్జెట్ సమర్పించే రోజు, సమయం 1999 సంవత్సరం వరకు ఫిక్స్డ్గా ఉండేది. బ్రిటిష్ కాలం నాటి ఆచారం ప్రకారం ఫిబ్రవరి చివరి రోజు సాయంత్రం 5 గంటలకు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టేవారు. 1999 లో ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ను సమర్పించే సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చారు. అదే సమయంలో 2017 లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ సమర్పణ తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు.
ఫస్ట్ పేపర్లెస్ బడ్జెట్..
బ్రిటీష్ సంప్రదాయాల ప్రకారం, బడ్జెట్ పత్రాన్ని గోధుమ లేదా ఎరుపు రంగు బ్యాగ్లో ఉంచుకుని బడ్జెట్ సమర్పించడానికి ఆర్థిక మంత్రి పార్లమెంటుకు చేరుకునేవారు. 2019 లో నిర్మలా సీతారామన్ బాధ్యతలు స్వీకరించే వరకు ఈ ట్రెండ్ కొనసాగింది. 2020 లో కరోనా వ్యాప్తిచెందిన తర్వాత 2021 లో బడ్జెట్లో మరో ముఖ్యమైన మార్పు వచ్చింది. అదే పేపర్లెస్ బడ్జెట్. గత రెండు సంవత్సరాలుగా టచ్ ప్యాడ్లో బడ్జెట్ను నిక్షిప్తం చేసి సభ్యులకు పంపిణీ చేస్తున్నారు.
బడ్జెట్ సెషన్..
కేంద్ర బడ్జెట్ సెషన్ జనవరి 31 నుంచి ప్రారంభమై.. ఏప్రిల్ 8 వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న సమర్పిస్తారు. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా తన పదవీకాలంలో వరుసగా ఐదో బడ్జెట్ను రేపు ప్రవేశపెట్టనున్నారు.