హైదరాబాద్ : దేశంలో కార్పొరేట్ సర్కారు వద్దని, కిసాన్ సర్కార్ రావాలని తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ అన్నారు. రైతు, సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ రోల్ మోడల్గా నిలిచిందని, ఆయా పథకాల్లో దేశంలోనే రాష్ట్రం తొలిస్థానంలో నిలిచిందని కితాబిచ్చారు. కర్ణాటకలో రాష్ట్రం గదగ్ జిల్లా ముందర్గి స్టేడియంలో కిసాన్ జాగృతి వికాస్ సంఘ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా శుభప్రద్ పటేల్, వికారాబాద్ జడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్తో కలిసి పాల్గొన్నారు. కిసాన్ జాగృతి వికాస్ సంఘం ఆధ్వర్యంలో అక్కడ 75 జంటల సామూహిక వివాహాలు జరిపించారు.
ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు విరించారు. అన్నం పెట్టే రైతు అప్పులపాలు కాకూడదని, రైతు యాచించే స్థితిలో కాకుండా.. శాసించే స్థాయిలో ఉండాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తుందన్నారు. సాగునీటి సదుపాయంతో పాటు వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ను అందిస్తున్నారని, దీంతో రైతుల్లో ఆత్మస్థయిర్యం పెరిగిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ది లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం నిర్మించి తెలంగాణ సస్యశ్యామలమైందని చెప్పారు. వ్యవసాయరంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న చేయూత దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం సహకారం లేకున్నా సంక్షేమ, అభివృద్ధి పథకాలను తెలంగాణ విజయవంతంగా అమలుచేస్తుందని చెప్పారు. తెలంగాణలో పెళ్లిల్లు జరిగితే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద రూ.1,00,016 అందజేస్తున్నారన్నారు. తెలంగాణలో రైతు సర్కార్ పాలన ఎలా నడుస్తోందో.. దేశంలో సైతం కిసాన్ సర్కార్ పాలన ఎంతో అవసరమన్నారు. కార్పొరేట్ (ఆదాని, అంబానీ) పాలన వద్దని, కిసాన్ సర్కార్ పాలన కావాలి అనే నినాదంతో సభలో రైతులు హోరెత్తించారు. అనంతరం రైతు సంఘం నాయకులు మఠాధిపతులతో కలిసి గోపూజ, నాగలి పూజ, ధనరాశి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జాతీయ రైతు సంఘం అధ్యక్షుడు యుగంధర్ నాయుడు, తెలంగాణ రైతు సంఘం ప్రతినిధి గోవింద్ రావు, పలువురు కర్ణాటక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.