(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర రైతాంగం మరోసారి పోరుబాట పట్టింది. ఉల్లికి మద్దతు ధర కల్పించడంతో పాటు 17 ఇతర డిమాండ్లతో రైతులు రోడ్డెక్కారు. రాష్ట్రంలోని నాసిక్ నుంచి ముంబై వరకు సోమవారం భారీ నిరసన మార్చ్ ప్రారంభించారు. డిమాండ్ల పరిష్కారంపై బీజేపీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన విరమించబోమని రైతు నాయకులు ప్రకటించారు. మార్చ్కు ముందు 12వ తేదీన రైతు నేతలతో మంత్రి దాదాభూసే చర్చలు విఫలమయ్యాయి.
ఆలిండియా కిసాన్ సభ ఆధ్వర్యంలో దాదాపు 10 వేల మంది రైతులు ఈ నిరసన ర్యాలీ ప్రారంభించారు. క్వింటాల్ ఉల్లికి రూ.2 వేలు మద్దతు ధర ప్రకటించాలని, ఉల్లికి మద్దతు ధరతో పాటు నష్టపోయిన రైతులకు రూ.600 సబ్సిడీ ఇవ్వాలని, ఉల్లి పంట ఎగుమతి విధానాలను మార్చాలని రైతులు డిమాండ్ చేశారు. పత్తి, సోయాబీన్, మిర్చి తదితర పంటలకు మద్దతు ధర రాక తీవ్రంగా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని ప్రధాన ఉల్లి మార్కెట్ అయిన లాసల్గావ్ లో ఫిబ్రవరి 4న క్వింటాల్ ఉల్లి రూ.1,115 ఉండగా, ఫిబ్రవరి 26 నాటికి రూ.550కి పడిపోయిందని రైతులు చెప్పారు. సౌదీ అరేబియా, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలు దిగుమతి సుంకాలు పెంచటంతో వ్యాపారులు ఉల్లి ధరను తగ్గించేశారని పేర్కొన్నారు.
ముఖ్యమైన డిమాండ్లు ఇవీ..
రైతుల ముఖ్యమైన డిమాండ్లలో రైతాంగానికి పూర్తి రుణమాఫీ, పెండింగ్లో ఉన్న విద్యుత్తు బిల్లుల రద్దు, వ్యవసాయానికి 12 గంటల విద్యుత్తు సరఫరా చేయాలని, అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వంటివి ఉన్నాయి.
పోరాటం మరింత ఉధృతం
ఆలిండియా కిసాన్ సభ ప్రతినిధులతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12న చర్చలు జరిపింది. రైతు నేతలు మంత్రి దాదాభూసేకు తమ డిమాండ్లు తెలిపారు. సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్లతో సమావేశం ఏర్పాటు చేయిస్తామని, ర్యాలీని నిలిపి వేయాలని కోరగా రైతు నాయకులు అందుకు ససేమిరా అన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ర్యాలీ విరమించేది లేదని, కిసాన్ లాంగ్ మార్చ్ ముంబై హైవేపై కొనసాగుతుందని ఎఐకేఎస్ నేత జీపీ గవిట్, మాజీ ఎమ్మెల్యే అశోక్ ధావలే, అజితి నవాలే, ఉమేష్ దేశ్ముఖ్, ఉదయ్ నార్కర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం దిగిరాకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతు నేతలు హెచ్చరించారు.